ధాన్యం కొనాలంటూ ఫేస్బుక్లో పోస్టు చేసిన శరత్
స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
గిట్టుబాటు ధరకు కొనేలా చూస్తానని హామీ
వెంటనే కలెక్టర్కు ఆదేశాలు.. ఆపై వెంటనే కాంటా
కృతజ్ఞతలు తెలిపినకొండపల్లి యువరైతు
గతంలో సీఎం కేసీఆర్ నుంచీ కాల్..
నెన్నెల మంచిర్యాల జిల్లా నెన్నెల మండ లం నందులపల్లికి చెందిన కొండపల్లి శరత్కు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఫోన్ చేశారు. కొండపల్లి శరత్ ఏడెకరాల్లో వరి పం డించాడు. ధా న్యాన్ని కొద్ది రోజులు కల్లంలోనే అమ్మకానికి పెట్టగా కొనేందుకు ఎవరూ రాకపోవడంతో ఇటీవల తుఫాన్ వస్తుందన్న భయంతో ఇంటికి తీసుకువచ్చాడు.
ఆ తర్వాత రైస్మిల్లర్లు, కొనుగోలుదారులను ఆశ్రయించాడు. క్వింటాలుకు రూ. 1800 కొంటామని చెప్పారు. ఇంత తక్కువకు అమ్మలేనని చెప్పాడు. ఇక లాభం లేదనుకుని తన ఫేస్ బుక్ ఖాతా 'మన పంటలు-మన వ్యవసాయం.. మీ రైతు శరత్'లో జై శ్రీరాం వడ్లు అమ్మకానికి పెట్టాం.. కావాల్సిన వారు సంప్రదించండి..' అని వీడియో పోస్టు చేశాడు. మూడు రోజుల వ్వవధిలోనే దాదాపు ఐదు లక్షల మంది దీనిని వీక్షించారు.
20 వేల మంది వరకు షేర్ చేశారు. ఇది రాష్ట్ర సీఎస్ సోమేశ్కుమార్ వరకు చేరింది. ఇది చూసిన ఆయన సోమవారం సాయంత్రం వెంటనే రైతు శరత్కు ఫోన్ చేశాడు. మొదట ఒక సామాన్యుడిగా ఫోన్ చేసి ధాన్యాన్ని ఎం తకు అమ్ముతావు?, బయట మార్కెట్లో ధర ఎంత ఉంది? మీ దగ్గర కొనుగోలు కేంద్రాలు లేవా? అక్కడ అమ్ముకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. చివరకు నేను రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను మాట్లాడుతున్నాని చెప్పాడు. మీ ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చూస్తాననీ, ఇప్పుడే మీ కలెక్టర్కు ఆదేశాలు ఇస్తానని శరత్కు హామీ ఇచ్చారు. ఆయన వెంటనే కలెక్టర్ భారతీ హోళికేరితో మాట్లాడి విషయం చెప్పారు. ఆమె వెంటనే రైస్మిల్లర్ల అసోసియేషన్ వారితో మాట్లాడి డీఎస్వోకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కొనుగోలుదారులు నందులపల్లికి వచ్చి శరత్ ఇంటి వద్ద ఉన్న 140 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సహకరించిన సీఎస్ సోమేశ్కుమార్, కలెక్టర్ భారతీ హోళికేరికి శరత్ కృతజ్ఞతలు చెప్పారు.
గతంలో సీఎం నుంచి ఫోన్
సీఎం కేసీఆర్ గతంలో ఇదే రైతు శరత్తో ఫోన్లో మాట్లాడారు. నందులపల్లిలోని తన భూమిని ఇతరులకు పట్టా చేశారని, రైతుబంధు పథకం డబ్బులు రావడం లేదంటూ న్యాయ పోరాటం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా తన గోడును వీడియో రూపంలో పెట్టగా.. అది సీఎం వరకు చేరింది. 2019, మార్చి 26న సీఎం శరత్కు ఫోన్ చేసి మాట్లాడారు. శరత్కు భూ మి పట్టా పాసు పుస్తకంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలంటూ సీ ఎం అధికారులను ఆదేశించారు. తన సమస్య పరిష్కారం కావడంతో శరత్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపాడు.
Post A Comment: