CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తహసిల్దార్ వద్దే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్

Share it:




మన్యం టీవి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మ్యుటేషన్‌ విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సరైన సమన్వయం లేనందున మ్యుటేషన్లు సకాలంలో కావడం లేదని అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ భూములపై బాగా పట్టున్న రెవెన్యూ శాఖలోనే రిజిస్ట్రేషన్లు చేయించితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావించింది.



రెండేళ్ల కిందటే..



రెండేళ్ల కిందట ప్రయోగాత్మకంగా 30 మండల రెవెన్యూ కార్యాలయాల్లో చేపట్టిన నమూనా రిజిస్ట్రేషన్ల కార్యక్రమం సఫలమైంది. మ్యుటేషన్‌ సమస్యకు పరిష్కారమూ లభించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా రైతులకు కలుగుతున్న ఇబ్బందులను తొలిగించాలన్న కృత నిశ్చయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ప్రధానంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయడం, రిజిస్ట్రేషన్ల శాఖను పునర్ వ్యవస్థీకరణ చేయడం లాంటి చర్యలతో పారదర్శకత పెరిగి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని గుర్తించింది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు జరిగినట్లయితే.. ఒక్క రోజులోనే మ్యుటేషన్‌ పూర్తయ్యేట్లు నిబంధనలు విధించే అవకాశం కనిపిస్తోంది.



తహసీల్దార్​ కార్యాలయల్లోనే.



కొత్తగా తీసుకురానున్న రెవెన్యూ చట్టం నేపథ్యంలో.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరిగేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్​ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మారనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌ శాఖ పూర్తిగా పునర్వ్యవస్థీకరణతో పాటు అవి అందించే సేవల్లో కూడా మార్పులు రానున్నాయి. భూములపై సమగ్ర అవగాహన, ప్రభుత్వ, నిషేధిత, వివాదాస్పద భూములు వంటి వాటిపై తహసీల్దార్లకు పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. దీంతో తహసీల్దార్వ ద్వారా రిజిస్టేషన్ ప్రక్రియ పక్కాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.



అయితే ఇప్పటికే తహసీల్దార్లకు ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో రిజిస్ట్రేషన్లపై శిక్షణ కూడా ప్రభుత్వం ఇచ్చింది. తాజా విధానంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌, ధరణి పోర్టల్‌ను అనుసంధానం చేయనున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రమే కొనుగోలుదారుడు, విక్రయదారుడు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఆ తరువాత రిజిస్ట్రర్డ్‌ డాక్యుమెంట్‌, పాస్‌ పుస్తకం కొనుగోలుదారుడికి పోస్టల్‌ ద్వారా వస్తుంది. రెవెన్యూ పేరు మార్పు ప్రక్రియ పూర్తయితే కార్యాలయాల చుట్టూ అన్నదాతలు తిరగాల్సిన అవసరం ఉండదు.



సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇకపై వ్యవసాయేతర భూములు, వివాహ రిజిస్ట్రేషన్లు లాంటి సేవలు మాత్రమే అందనున్నాయి. సత్వర పారదర్శకతనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా వాటిని పునర్వ్యవస్థీకరించే చర్యలు చేపట్టింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తిగా తహసీల్దార్​ కార్యాలయం పరిధిలోకి వెళ్తే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని భారం తక్కువగా ఉంటుండడం వల్ల వాటిని గుర్తించి రద్దు చేయడం లేదా పనిభారం అధికంగా ఉండే ప్రాంతాలకు తరలించే విషయాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ పరిశీలిస్తోంది. అధికంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు 20కి పైగా ఉండొచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేసింది.



మరిన్ని అందుబాటులోకి..



ప్రభుత్వ ఆదేశాలతో పునర్‌ వ్యవస్థీకరణపై ఆగమేఘాలుగా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లు అత్యధికంగా ఉండే కార్యాలయాల్లో పని బాగా ఎక్కువ ఉన్న వాటిని గుర్తించే పనిలో పడింది. అవసరమైతే కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కానీ, లేదా అదనపు సిబ్బందిని సర్దుబాటు చేయడం లాంటి అంశాలపై కూడా కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జోరుగా స్థిరాస్థి వ్యాపారం జరిగే ప్రాంతాల్లో కార్యాలయాలు మరిన్ని అందుబాటులోకి తెచ్చే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.



ఒకట్రెండు రోజుల్లో ఆమోదం!



తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశలో కసరత్తు జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ఒకట్రెండు రోజుల్లోనే రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదముద్ర వేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు లేని మండల కేంద్రాలు 443 మండలాలు ఉన్నట్లు అధికారుల కసరత్తులో తేల్చారు. రెండ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎన్నింటిని మిగిల్చుతారు... ఎన్ని సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయాలకు స్థానభ్రంశం కలుగనుందో తేలిపోతుంది.


Share it:

TELANGANA

Post A Comment: