టీ20 ప్రపంచకప్ 2022 అనంతరం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. కివీస్తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబర్ 18 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుండగా.. నవంబర్ 25 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచులు నవంబర్ 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. కివీస్ పర్యటనకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ద్రవిడ్ అందుబాటులో లేని కారణంగా కివీస్ టూర్కు నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించనున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్కు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చిన నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
ద్రవిడ్ పదేపదే విరామలెందుకు తీసుకుంటున్నాడని ప్రశ్నించాడు. కోచ్ అనేవాడు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపాలని, పదేపదే విరామాలు తీసుకోవద్దని సూచించాడు. ఐపీఎల్ లీగ్ సమయంలో రెండు, మూడు నెలల విరామం సరిపోవడం లేదా అని రవిశాస్త్రి మండిపడ్డాడు. 'నాకు విరామాలపై పెద్దగా నమ్మకం లేదు. జట్టు, ఆటగాళ్లను అర్థం చేసుకుని.. జట్టుపై నియంత్రణను కలిగి ఉండాలని నేను భావిస్తున్నా. మీకు ఎన్నిసార్లు విరామాలు కావాలి?. ఐపీఎల్ లీగ్ సమయంలో 2-3 నెలల విరామం లభిస్తుంది. కోచ్గా మీరు విశ్రాంతి తీసుకోవడానికి ఆ సమయం చాలా ఎక్కువ. మిగతా సమయంలో కోచ్గా ఎవరున్నా భారత జట్టుకు అందుబాటులో ఉండాలి. కోచ్ ఎప్పుడూ అందుబాటులో ఉండి ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపాలి' అని రవిశాస్త్రి అన్నాడు.
ఇంగ్లండ్ జట్టు అనుసరించిన విధానాలను అలవర్చుకోవాలని భారత టీ20 జట్టుకు సూచించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, దినేష్ కార్తీక్ వంటి సీనియర్లకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. సీనియర్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. సీనియర్లు లేకున్నా కుర్రాళ్లతో భారత్ పటిష్టంగానే ఉంది. శుభ్మన్ గిల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ టీ30 జట్టులో ఉన్నారు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం (నవంబర్ 18) న్యూజిలాండ్తో భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాగా.. వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్.
Post A Comment: