- పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న తెలంగాణ సర్కార్
- ఫీజుల జీవో నెంబర్ 37ను ఉససంహరించుకోవాలి
- రూ.2700 కోట్ల పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలి
- ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్, నాగుల్
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 26... అడ్డగోలుగా ఇంజనీరింగ్ ఫీజులను పెంచుతూ పేద విద్యార్ధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యకు దూరం చేస్తోందని అఖిల భారత విద్యార్ధి సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోయిన విజయ్ కుమార్, ఎస్ కె.నాగుల్ మీరా ఆరోపించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలులో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్, మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ నినాదాలు చేసిన అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాపితంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, ఇతర వృత్తి విద్యాకోర్డులకు సంబంధించి విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 2021-22 విద్యాసంవత్సరానికి సంబందించి ఎస్పీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు రూ.2,700 కోట్ల బకాయి చెల్లించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వం తీరుతో కళాశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులను బయటకు గెంటివేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పేద విద్యార్ధులకు గుదిబండగా మారిందని, తక్షణమే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.37ను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో విద్యార్ధులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అజిజ్, ఎస్.కె.ఖయ్యుమ్, పి.క్రాంతికుమార్, బరిగెల భూపేష్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: