జూలూరుపాడు ఆగస్టు 16, (మన్యం మనుగడ ప్రతినిధి) 75వ స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా సామూహికంగా జాతీయ గీతాలాపన చేసి తమ దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలోని చండ్రుగొండ రోడ్డు అంబేద్కర్ సెంటర్ నందు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సామూహికంగా జాతీయ గీతాలాపనతో మువ్వన్నెల జెండాకు వందనం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అదే విధంగా మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామపంచాయతీ కార్యాలయాలలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను అలరించాయి.
Post A Comment: