న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల కటౌట్లు, బ్యానర్లు వెలిసాయి. ప్రజా ప్రతినిథులతోపాటు అభిమానులు ఢిల్లీకి భారీ సంఖ్యలో చేరుకున్నారు. రైతన్న కోసం పోరాడుతున్న కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నెత్తిన వడ్ల బస్తా.. ఒంటి నిండా గులాబీ రంగు పూసుని వచ్చిన ఓ యువకుడు దేశ్ కీ నేత కేసీఆర్ అని రాసుకుని ప్రత్యేకార్షణగా నిలిచాడు.
మరో వ్యక్తి తన ఒంటిపై రైతు గొంతుక కేసీఆర్ రాసుకుని ముఖ్యమంత్రి పోరాటానికి మద్దతు తెలిపాడు. చేతిలో టీఆర్ఎస్ జెండా పట్టుని వచ్చిన ఆయన రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ ఆశాజ్యోతి అని చెప్పారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నలుపు రంగు వస్త్రాలు ధరించిన సండ్ర.. వరి కంకులతో సభాస్థలికి చేరుకున్నారు. ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. కావడికి ముందు మోదీ ఫొటోను, వెనుకాల వరికంకులను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నలుపు రంగు వస్త్రాలు ధరించి దీక్షకు హాజరయ్యారు.
Post A Comment: