మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట శ్రీ లక్ష్మీతులసి ఆగ్రో పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో సొంకు మండవి అనే జార్ఖండ్ కు చెందిన వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పేపర్ బోర్డు యాజమాన్యాన్ని బాధ్యులను చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా ఆంధ్రా నుంచి ఒక బ్రోకర్ సహాయం తో బీహార్ నుండి బాల కార్మికులను తీసుకువచ్చి ప్రమాదకర ప్రదేశాలలో ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా వెట్టి చాకిరీ చేయించడం పై ప్రభుత్వం విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీల చట్టాల ప్రకారం, కార్మిక చట్టాల ప్రకారం నియమ నిబంధనలు అనుసరించి నడుచుకోవాల్సిన పేపర్ బోర్డు యజమాన్యం, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, రక్షణ చర్యలను గాలికొదిలి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అనేక మరణాలు సంభవించినప్పటికీ వారి కుటుంబాలకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదని, ఎంతోమంది ప్రమాదాలకు గురై వికలాంగులయినప్పటికి వారికి జీవన భృతి కూడా కల్పించలేదని విమర్శలు ఉన్నాయి. శ్రీ లక్ష్మి తులసి పేపర్ బోర్డులో ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం కాకుండా, కనీస సౌకర్యాలు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కాని, మరుగుదొడ్లు కానీ, రాత్రి షిఫ్టుల్లో లైటింగ్ ఏర్పాటు చేయడం కానీ ఇంకా అనేక సమస్యలు కార్మికులను పట్టిపీడిస్తున్నాయని, అనేక మంది కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, వారికి నిబంధనల ప్రకారం అందాల్సిన సౌకర్యాలు కానీ అందడం లేదని,ఈ విషయాలపై ప్రభుత్వ అధికారులు, లేబర్ అధికారులు, స్థానిక అధికారులు దృష్టిసారించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పేపర్ బోర్డు యజమాన్యం పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
Post A Comment: