మన్యం టీవీ, చర్ల:
చర్ల మండలంలోని పులిగుండాల,కొండవాయి వలస ఆదివాసీ గుత్తి కోయ గ్రామాల్లో ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాలతో చర్ల పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతీ కుటుంబానికి వాటర్ ఫిల్టర్,దోమ తెరలు,గ్రామానికో టీవీ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓఎస్డీ వి.తిరుపతి భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్.జి,చర్ల ఇన్స్పెక్టర్ బి.అశోక్,సిఐ రాజగోపాల్ మరియు ఎస్ఐ రాజువర్మ ల చేతులు మీదుగా వీటిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఓఎస్డీ తిరుపతి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునిల్ దత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల ఆరోగ్యం పట్ల పోలీసుశాఖ ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం జరుగుతోందని ఆయన అన్నారు.
వర్షా కాలంలో వాగు నీటిని సేవించి గుత్తి కోయ గ్రామాల్లో నివసించే పిల్లలు,పెద్దలు,వృద్ధులు,మహిళలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు, స్వచ్చమైన నీటిని వారికి అందించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ కుటుంబానికి వాటర్ ఫిల్టర్ తో పాటు దోమ తెరలు పంపిణీ చేశామని చెప్పారు.
కరోనా నేపథ్యంలో కరోనా వైరస్ సోకి ఇబ్బందులు పడుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తే ఎలాంటి కేసులు లేకుండా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
అదే విధంగా మావోయిస్టుల కుటుంబ సభ్యులు చొరవ తీసుకుని ఆజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించొద్దని,కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లోకి వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అనంతరం భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపీఎస్ మాట్లాడుతూ వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కలుషితమైన నీటిని సేవించరాదని తెలిపారు.
వర్షాలకు వాగులు పొంగి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలాంటి సమయంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే వైద్య బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంకా అటవీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Post A Comment: