కొనుగోలు కేంద్రాల్లో మక్కలకు మద్దతు- పీఏసీఎస్ అధ్యక్షులు గోగ్గెల రామయ్య
* నిబంధనలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం
* హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
గుండాల మన్యం టీవీ: రైతులు పండించిన ప్రతి మక్కగింజను మద్దతు దరతో కొనుగోలు చేస్తామని గుండాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు గోగ్గెల రామయ్య, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని అన్నారు. గుండాల మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో మక్కలను కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే తప్పనిసరిగా రైతుబంధు పోర్టల్ లో నమోదు చేయాల్సి వచ్చేది అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది రైతులు పోర్టల్ లో నమోదు చేసుకోకపోవడంతో దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మక్కల కొనుగోలులో నిబంధనలు సడలించింది అని తెలిపారు. ఎటువంటి ఆన్లైన్ నమోదు చేయకుండానే రైతు పండించిన పంటకు గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా వ్యవసాయ అధికారి ధ్రువీకరణ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిబంధనలు ఎత్తివేయడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంక్షేమం కొరకు రైతుల బాధలు అర్థం చేసుకొని ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషిచేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్, మార్క్ఫెడ్ డీఎం లకు అభినందనలు తెలిపారు. సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో రెండవ రకం పత్తికి రూ. 5800 ధర పలుకుతుండగా ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో కొందరు దళారులు మొదటి రకం పత్తికి కేవలం రూ.4200 మాత్రమే చెల్లించి రైతులను మోసం చేస్తున్నారని, గుండాల మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన నాయకులు సయ్యద్ అజ్జు, కాంగ్రెస్ మండల కార్యదర్శి ఈసం పాపారావు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: