'అల వైకుంఠపురములో విడుదలైంది 2020 జనవరిలో. ఆ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అయినా.. ఇప్పటికీ తన కొత్త సినిమాను మొదలుపెట్టలేకపోతున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరి సినిమా. 'భీమ్లా నాయక్' కోసం ఆయన కొన్ని నెలల సమయం కేటాయించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్తో అనుకున్న సినిమా విషయంలో ఆలస్యం జరడం.. అది క్యాన్సిల్ కావడంతో కొంత సమయం వృథా అయింది. ఆపై మహేష్తో సినిమా ఓకే అయినా.. హీరో అందుబాటులోకి రావడానికి టైం పట్టింది.
అంతా ఓకే అనుకునేసరికి ఈ సినిమాకు ఏదో రకమైన అడ్డంకి తప్పట్లేదు. మహేష్ బాబు తల్లి మరణంతో షూట్ ఆలస్యం జరిగింది. పైగా కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక, తొలి షెడ్యూల్ తర్వాత తర్జనభర్జనలు జరిగి ఈ సినిమాకు బ్రేక్ పడింది. చివరికి కథలో మార్పులు చేర్పులు జరిగి అంతా ఓక అనుకుని డిసెంబరు తొలి వారంలో చిత్రీకరణ మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఆర్టిస్టుల డేట్లు సంపాదించి 'మహేష్ 28' టీం షెడ్యూళ్లు ప్లాన్ చేసుకుంటోంది. ఐతే ఇప్పుడు మహేష్ తండ్రి కృష్ణ మరణించారు. ఇది మహేష్ జీవితంలో అతి పెద్ద విషాదం అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ ఏడాది అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరల మరణంతో మహేష్ తీవ్రమైన బాధలో ఉన్నాడు. ఇంతలోనే తండ్రి మరణించడం ఆయన్ని కుంగుబాటుకు గురి చేసేదే అనడంలో సందేహం లేదు. ఈ బాధ నుంచి మహేష్ కోలుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది.
ఒక సినిమాకు అందరి డేట్లు సంపాదించి, షెడ్యూళ్లు వేసుకున్నాక షూట్ వాయిదా వేయడం చాలా కష్టమే కానీ.. వరుసగా ఇంత పెద్ద విషాదాల తర్వాత మహేష్ ఆ మూడ్ నుంచి బయటికి వచ్చి నవ్వుతూ సినిమా చేయడం అన్నది చాలా చాలా కష్టమైన విషయం. అందుకే చిత్ర బృందం ఈ సినిమాను కొన్ని నెలల పాటు పక్కన పెట్టక తప్పదని తెలుస్తోంది. మహేశ్ ను వరుస విషాదాలు వెంటాడుతుండటంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
Post A Comment: