ఇరాన్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తుండగా.. మరోవైపు టెహ్రాన్లోని మెట్రో స్టేషన్లో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపి కర్రలతో కొట్టారు. కాల్పులతో గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. 22 ఏళ్ల మహ్సా అమిని మరణానికి వ్యతిరేకంగా మెట్రో స్టేషన్లో ప్రజలు భారీగా చేరుకుని ఆందోళన చేశారు. హిజాబ్ ధరించనందుకు ఇరాన్లో కలకలం హిజాబ్ వివాదంపై గత కొన్ని రోజులుగా ఇరాన్లోని వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
సెప్టెంబర్ 13న హిజాబ్ ధరించనందుకు మెహ్సా అమిని అనే అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె మూడు రోజుల తరువాత మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు మొదలయ్యాయి. మహిళలు తమ హిజాబ్లను కాల్చడమే కాకుండా జుట్టును కత్తిరించుకోవడానికి బహిరంగంగా వీధుల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్లో పోలీసులకు నిరసనకారుల మధ్య అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. నిరసనకారులపై భద్రతా బలగాలు చర్యలు తీసుకోవడంతో ఇరాన్లో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రదర్శనల సందర్భంగా చాలా చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ముష్కరుల కాల్పుల్లో ఐదుగురు మరణం.. బుధవారం నైరుతి ఇరాన్లోని ఇజే సిటీలోని మార్కెట్లో గుర్తుతెలియని ముష్కరులు నిరసనకారులు, భద్రతా దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. కొంతమంది గుర్తుతెలియని ముష్కరులు బైక్పై వచ్చి భద్రతా బలగాలు, నిరసనకారులపై కాల్పులు జరిపారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ సమాచారం ఇచ్చింది. అయితే దాడికి గల కారణాలు ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. దాడికి బాధ్యత వహిస్తున్న ఏ గ్రూపు ఇంకా ప్రకటించలేదు.
Post A Comment: