సెప్టెంబర్నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో అరబిందో ఫార్మా రూ . 5,729కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ. 410 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ .6,038.50 కోట్లు కాగా, నికరలాభం రూ .696 కోట్లు. నికరలాభం 41 శాతం తగ్గిపోవడానికి ప్రధాన కారణం ముడి పదార్థాల వ్యయం బాగా పెరగటమని కంపెనీ అంటోంది. అలాగే ఫైనాన్స్ వ్యయాలు, ఇతర ఖర్చులు పెరిగాయని కంపెనీ తెలిపింది.
కంపెనీ మొత్తం ఆదాయంలో అమెరికా మార్కెట్ వాటా 11 శాతం తగ్గి 46 శాతానికి పడిపోయింది. కొత్తగా అమెరికా మార్కెట్లో 14 ఔషధాలకు ఎఫ్డీఏ అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కంపెనీ రూ.12,073 కోట్ల ఆదాయం, రూ. 930 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ .11,850 కోట్లు కాగా, నికరలాభం రూ.1,466 కోట్లు. ఆర్ అండ్ డీపై రెండో త్రైమాసికంలో రూ.276 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది.
Post A Comment: