💥ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
మన్యం మనుగడ,హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన దళిత సాధికారత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. సమావేశంలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్ర అని వ్యాఖ్యానించారు. 'నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. అందుకు బాధ్యులు పాలకులే అవుతారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి పోయినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్గాలు దళితులే. దళితుల సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో..? దశలవారీగా కార్యాచరణ అమలు చేస్తాం. దళితులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లడానికి ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు చేయండి' అని సమావేశంలో నేతలను కేసీఆర్ కోరారు. దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం.. అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా వుందని పలువురు దళిత నేతలు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
Post A Comment: