తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్
ఢిల్లీ, మన్యం టీవీ :
కేంద్ర బడ్జెట్ 2021ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. చరిత్రలో తొలిసారిగా ఈసారి బడ్జెట్ కాగితరహితంగా ఉంటోంది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్ ప్రతుల ముద్రణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కూడా బడ్జెట్ పత్రాలకు బదులు ట్యాబ్తో పార్లమెంట్కు వెళ్ళారు.
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బృందం రాష్ట్రపతిభవన్కు బయల్దేరింది. అక్కడ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన అనంతరం పార్లమెంట్కు చేరుకుంటారు. అయితే ఈసారి నిర్మలమ్మ చేతిలో సంప్రదాయ బాహి ఖాటాకు బదులు మేడిన్ ఇండియా ట్యాబ్ కన్పించింది. గతంలో బడ్జెట్ కాపీలను ఆర్థిక మంత్రులు లెదర్ సూట్కేసులు పట్టుకొచ్చేవారు. అయితే 2019, 2020లో నిర్మలా సీతారామన్ మాత్రం సంప్రదాయ బాహీ ఖాటా(వస్త్రం లాంటి సంచి)లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ట్యాబ్లో బడ్జెట్ పద్దును తీసుకొస్తున్నారు.
తొలిసారి బడ్జెట్ ప్రతులు లేకుండా!
1947 నవంబరు 26న తొలిసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏటా బడ్జెట్ పత్రాల ముద్రణ చేపడుతున్నారు. బడ్జెట్ సమావేశానికి రెండు వారాల ముందు ఈ ప్రింటింగ్ మొదలుపెడతారు. అయితే ఈసారి కరోనా కారణంగా బడ్జెట్ పత్రాల ముద్రణ చేపట్టకూడదని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు పార్లమెంట్ ఉభయసభల సభ్యులు కూడా సమ్మతించడంతో ప్రింటింగ్ చేపట్టలేదు. అందుకు బదులుగా సభ్యులందరికీ బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇవ్వనున్నారు.
అనురాగ్ ఠాకూర్ పూజలు
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే తమ బడ్జెట్ ఉండబోతోందని తెలిపారు.
..
Post A Comment: