హైదరాబాద్: ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయడం అనేది తెలంగాణ ప్రజల్లో ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఇటీవల నియమించిన విద్యార్థి, యువజన కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యువకులు, విద్యార్థులు రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్ళి ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మన చుట్టూ ఉన్న ప్రజల కోసం బలంగా నిలబడి గొంతు వినిపించాలన్నారు. ఆ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా పని చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ తరఫున అందరం క్రియాశీలకంగా వ్యవహరించాలని వెల్లడించారు. ‘‘పాలమూరు రైతులు, కూలీల ఇబ్బందులు కావచ్చు... ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా స్పందిద్దాం. మన వంతుగా మనం అండనిచ్చి నిలబడదాం. ఎప్పటికప్పుడు కమిటీలతో సమావేశం అయి చర్చిద్దాం’’ అని నేతలను పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
..
Post A Comment: