పటాకులపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పటాకుల అమ్మకాలు, వినియోగాన్నినిషేధించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పటాకుల దుకాణాలు తక్షణమే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సామాజిక కోణంలో భాగంగా పండుగలు చాలా ముఖ్యమైనవని, కానీ ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానమైనవని హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పటాకులపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్చౌహాన్, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ కొవిడ్ -19 వైరస్ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. పటాకులు కాల్చడం వల్ల గాలి నాణ్యత తగ్గి శ్వాసకోశ వ్యాధులున్న రోగులు, కొవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతారని ధర్మాసనానికి నివేదించారు.
ప్రజల ప్రాణాల రక్షణ దృష్ట్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. పటాకుల నిషేధంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు స్వీయ నియంత్రణలు పాటిస్తారని ఆశిస్తున్నదని తెలిపారు. పండుగల విషయంలో ఆంక్షలు విధించరాదన్న సదుద్దేశంతో ప్రభుత్వం జాగ్రత్తలు సూచించిందని తెలిపారు. ఇరువర్గాల వాదనలు నమోదుచేసుకొన్న ధర్మాసనం.. ప్రస్తుతం కొవిడ్ 19 మహమ్మారితో దేశం, రాష్ట్రం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుచేసింది. పలు దేశాల్లో ఇప్పటికే సెకండ్వేవ్ ప్రారంభమైందని సంకేతాలు అందుతున్నాయని వ్యాఖ్యానించింది. పటాకుల వల్ల గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుందని, కరోనా వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రంగా దాడి చేస్తుందని పేర్కొన్నది.
ఈ రెండు వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది. రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో పటాకుల అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించారని, ఇప్పటికే పలు హైకోర్టులు కూడా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేశాయని గుర్తుచేసింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత, అందుకోసం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపింది. నియంత్రణ లేకుండా పటాకులు వినియోగించడం వల్ల కరోనా, శ్వాసకోస రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పటాకుల అమ్మకంపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే తెరిచిన దుకాణాలను మూసేయాలని స్పష్టంచేసింది. ప్రజలు పటాకులు కాల్చకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పించాలని తెలిపింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలపై వివరణ సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
Post A Comment: