జూలూరుపాడు , సెప్టెంబర్ 6, (మన్యం మనుగడ ప్రతినిధి) : మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామ శివారు కాకర్ల రోడ్డు లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు, పాఠశాల నీటి అవసరాల కొరకు ఏర్పాటుచేసిన మోటర్ బోరు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి నేటి వరకు మరమ్మత్తులకు నోచుకోక ఉత్స విగ్రహంలా పడి ఉంది. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్న, మరమ్మత్తులు చేయించాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులతో పాటు, అంగన్వాడి సెంటర్ లో పదిమంది పిల్లలకు వంటకు నీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పాఠశాలలకు మెయింటినెన్స్ గ్రాంట్ ఇస్తున్నప్పటికీ ఇలాంటి అత్యవసరాలకు ఉపయోగించకపోవడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల పర్యవేక్షణ లోపం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Navigation
Post A Comment: