మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన నాలి సత్యవతి(30) ఒప్పంద ఏఎన్ఎం గా పినపాక మండలంలోని ఉప్పాక పంచాయతీలో గల ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో తన సేవలను అందిస్తుంది. తన వృత్తి పట్ల ఉన్న అంకితభావం కారణంగా గతంలో పలువురు నుండి ప్రశంసలు అందుకుంది. ఇటీవలనే ఏఎన్ఎం కు సంబంధించిన ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. రెండు రోజుల్లోనే ఒప్పంద ఏఎన్ఎం గా ఉన్న సత్యవతి ప్రభుత్వ ఏఎన్ఎమ్ గా మారనుంది. ఆదివారం సెలవు దినం కావడంతో సొంత ఊరికి వెళ్ళిన సత్యవతి సోమవారం రోజున స్వగ్రామం నుండి తిరిగి వస్తున్న క్రమంలో తోగ్గూడెం, గోపాల్ రావు పేట గ్రామాల మధ్య జోరువాన కురుస్తున్న సమయంలో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ కి ఒక్కసారిగా తన ద్విచక్ర వాహనం తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన గ్రామస్తులు, ఆ మార్గం గుండా వెళుతున్న ప్రయాణికులు వెంటనే ఆమెను పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివకుమార్ ఆమె మరణించినట్లుగా ధ్రువీకరించారు. కాసేపట్లో విధుల్లో చేరబోతున్న తమ తోటి వ్యక్తి విగత జీవిగా మారడంతో, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ప్రభుత్వ కొలువు వచ్చిందనుకున్న తమ బిడ్డ కానరాని లోకాలకు వెళ్లడంతో కన్న తల్లిదండ్రుల బాధకు అవధులు లేవు. ఆమె మరణంతో పినపాక, కరకగూడెం మండలాలలో విషాదచాయలు అలుముకున్నాయి.
Post A Comment: