జూలూరుపాడు ఆగస్టు 10, (మన్యం మనుగడ ప్రతినిధి) దేశ స్వతంత్రమే లక్ష్యంగా ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఆవిర్భవించి, విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతుందని, సిపిఐ వైరా నియోజకవర్గ నాయకురాలు భానోత్ విజయభాయి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు జర్పుల ఉపేందర్ అన్నారు. బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిని నిర్దేశించే విద్య రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించి కార్పొరేట్ కబంధ హస్తాల్లో విద్యారంగాన్ని మమేకం చేశారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సరిపడా బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. కొఠారి కమిషన్ సిఫారసు ప్రకారం కేంద్ర జిడిపిలో ఆరు శాతం, కేంద్ర బడ్జెట్లో 10% రాష్ట్ర బడ్జెట్లో 30% కేటాయించాలని సూచించిన, నేటి పాలకులు ఆప్రయత్నం చేయట్లేదని విమర్శించారు. కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభకు 33 జిల్లాల నుండి 700 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని, కొత్తగూడెంలో 26, 27, 28 తేదీలలో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే చాంద్ పాషా, పగడాల అఖిల్, గార్లపాటి వీరభద్రం, పత్తిపాటి మహేష్, వెంకటేష్, వంశీ, రాము తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: