జూలూరుపాడు జులై 31, (మన్యం మనుగడ ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం గ్రామ పంచాయతీలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో యూనిఫాం వేసుకోలేదని 16 మంది విద్యార్థులను ఉపాధ్యాయురాలు చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పదహారు మంది విద్యార్ధినులు యూనిఫాం వేసుకుని రాలేదనే కారణంతో పిఈటి నాగమణి విచక్షణా రహితంగా హరచేతులపై కాళ్లపై కొట్టారు. కొందరు విద్యార్థులు మాకు యూనిఫామ్ ఇవ్వలేదని చెబుతున్న వినిపించుకోకుండా, మీరు సొంతగా కొని కట్టుకోవాలని ఆదేశించారు. దీంతో కొందరు అమ్మాయిలకు చేతులకు, కాళ్ళకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం స్కూల్ అసెంబ్లీ కార్యక్రమానికి ముందు జరిగింది. అప్పటికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాకపోవడంతో అనంతరం విద్యార్థులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ కు విషయాన్ని తెలియజేయగా పిఈటి తో మాట్లాడతానని విద్యార్థులకు నచ్చజెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బయటకు పొక్కకుండా రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా చేశారు. కారణం "తీగలాగితే డొంక కదిలినట్లు" ప్రస్తుతం విద్యార్థులు చెబుతున్న ప్రకారం మధ్యాహ్న భోజనం సక్రమంగా లేదు, చాలామంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. విద్యార్థులు ప్రశ్నిస్తే పనిష్మెంట్, ఉపాధ్యాయుల్లో గ్రూపులు, వెరసి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఇది పాఠశాల ప్రస్తుత పరిస్థితి. ఒకపక్క జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల గురించి చైతన్య కలిగిస్తుంటే, మరోపక్క పాఠశాలల ఉపాధ్యాయులు విచక్షణ రహితంగా వ్యవహరించి ఉపాధ్యాయ వృత్తికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పై అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కింది స్థాయిలో 'వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా' సాగుతుందనె గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటన మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Navigation
Post A Comment: