మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ముంపు ప్రాంతాలైన భూపతిరావుపేట, ఎల్చి రెడ్డిపల్లి, చింతల బయ్యారం, రాయి గూడెం ప్రాంతాలకు చెందిన ప్రజలు పునరావాస ప్రాంతానికి వెళ్లడం కోసం మండల అధికారులు నానా ప్రయాసలు పడుతున్నారు. ఈ గ్రామాలను వరద నీరు ముంచి వేయడంతో వెళ్లడానికి దారి లేక పొలంగట్లే శరణ్యం అయ్యాయి. ఎడతెరిపిలేని వర్షం, ప్రాంతాలను వదలని వరద కారణంగా నానా ఇబ్బందులు పడుతూ, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొంత మంది ప్రజలకు పశు సంపద ఉండడంతో , గోదావరి తమ ఇళ్లను ముంచుతున్నప్పటికీ, సాయంత్రం వరకు రాలేక నిరీక్షించి, చేసేది లేక పునరావాస బాట పట్టారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పినపాక మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఏడూళ్ళ బయ్యారం ఎస్సై టీవీ ఆర్ సూరి లు చింతల బయ్యారం గ్రామంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం కోసం, పొలం గట్ల ద్వారా చేరుకుని వారిని గమ్యస్థానాలకు చేర్చారు.
Post A Comment: