- ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు
★ కుటుంబాన్ని పోషించేందుకు మేకల కాపరిగా మారిన బాలుడు
★ ఆపత్కాలంలో అండగా రైతుబీమా
మన్యం టీవీ వెబ్ న్యూస్:
అతడి పేరు మంగారపు కరణ్. వయసు 16 ఏండ్లు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దహెగాంకు చెందిన ఆదివాసీ నాయక్పోడ్ బిడ్డ. అండగా నిలవాల్సిన తండ్రి అనారోగ్యంతో కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యతలు భుజానెత్తుకోవాల్సి వచ్చింది. ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు తోడుగా నిలవాలి, పెండ్లిళ్లు చేయాలి. దానికోసం ఏడాదికి రూ.85 వేల చొప్పున మాట్లాడుకొని మేకల కాపరిగా మారాడు. పదో తరగతిలో 8.8 గ్రేడ్తో పాసైనా, పైచదువులు కొనసాగించే పరిస్థితి లేదు.
ఇక ఇంతేనా.. అనుకొంటున్న తరుణంలో తండ్రి బీమన్న పేరిట ఉన్న మూడెకరాల భూమి ద్వారా అందివచ్చిన రైతు బీమా కరణ్కు ఆశాకిరణమైంది. రూ.5 లక్షలు రావటంతో ఇప్పుడు అతడు కష్టాల కడలిలోంచి ఒడ్డుకు చేరాడు. అక్క గంగమణి ఇంటర్ చదువుకు ఇబ్బంది ఉండదని, 9వ తరగతి చదువుతున్న చెల్లి సాక్షిని పైచదువులు చదివిస్తానని సంబురంతో ‘నమస్తే తెలంగాణ’కు చెప్పాడు. వారిద్దరి పెండ్లిళ్ల కోసం ఆ డబ్బును బ్యాంక్లో జమ చేసిన కరణ్.. రైతు బీమా తనకు ధీమా అయ్యిందని, కొండంత ధైర్యాన్నిచ్చిందని చెప్తున్నాడు. భూమిని కౌలుకు ఇచ్చాడు. తల్లి కూడా కూలీ పనులకు వెళ్తున్నది. ‘రైతుబీమా రాకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఇంటర్లో నాకిష్టమైన ఎంపీసీ కోర్సు చదువుతా’ అని సంతోషంతో తెలిపాడు. తనలో ఆత్మవిశ్వాసాన్ని, భరోసాను నింపింది రైతుబీమానేనని గర్వంగా చెప్తున్నాడు.
15 రోజుల్లోనే రైతుబీమా డబ్బులు చేతికి
కరణ్ తండ్రి భీమన్న నెల కిందట తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. భీమన్నకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా చేయించటంతో ఆ డబ్బు రూ.5 లక్షలు 15 రోజుల్లోనే చేతికి అందాయి. తల్లి సహాయంతో కరణ్ ఆ డబ్బును బ్యాంక్లో దాచిపెట్టాడు.
Post A Comment: