టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరున్నా.. కూల్ గా పని చేసుకుపోవటమే హరీష్ రావు వర్కింగ్ స్టయిల్. ఎంత పెద్ద విపత్తు వచ్చినా తెలివితో పరిష్కరిస్తారు. ఆవేశం, హడావిడి అస్సలు ఉండదు. క్లాస్ గా కనిపించే మాస్ లీడర్. అయితే తొలిసారి హరీష్ రావు మొహంలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మన ఊరు మన బడి కార్యక్రమంలో అధికారుల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. పసి పిల్లలతో తనకి పూలు చల్లించిన విద్యాశాఖ అధికారులపై ఫైర్ అయ్యారు. ఇంకోసారి ఇలాంటి పనులు రిపీట్ అవ్వొద్దంటూ అందరిముందే అధికారులకి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చేశాడు.
సిద్ధిపేట జిల్లా కొండపాక గ్రామంలోని కుకునూర్ పల్లి గ్రామంలో జరిగిన మన ఊరు మన బడి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయనకి స్వాగతం చెప్పేందుకు స్కూల్ పిల్లల్ని బయట వరుసగా నిల్చోబెట్టి హరీష్ రావుపై పూలు చల్లించారు అధికారులు. ఇదే హరీష్ రావు ఆగ్రహానికి కారణం అయ్యింది. అసలే ఎండకాలం, గరిష్ట స్థాయిలో ఉష్ణోగతాలు నమోదవుతున్నాయి. పెద్దలు కూడా బయట అడుగు పెట్టలేని పరిస్థితి. ఈ తరుణంలో పసి పిల్లలని ఎండలో తనకోసం అంతసేపు నిల్చోబెట్టడం ఏంటని అధికారులపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. మరోసారి ఇలాంటివి చేయొద్దని చెప్పారు. మంత్రి దగ్గర మార్కుల కోసమో.. లేక ఇతర కారణాలో కానీ కొంతమంది అధికారులు ఇలాంటి పనులు చేయటం తగదని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అధికారులకి ఇంత అత్యుత్సహం పనికిరాదని అంటున్నారు. మంత్రి హరీష్ రావు పిల్లల పట్ల తీసుకున్న జాగ్రత్తకి కాంప్లిమెంట్ చేస్తున్నారు.
Post A Comment: