ప్రజా సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వ హామీలు అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం పాలవంచ పట్టణంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ
రాష్ట్రంలో వెనుకబడిన పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెట్రోలు , డీజిల్ నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారాలు మోపుతున్నారు తప్ప, ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ఆయన విమర్శించారు. సమాజ పురోగమనంలో క్రియాశీల పాత్ర నిర్వహించాల్సిన యువత పెడదారులు పడుతున్నారని కొందరు డ్రగ్స్ మత్తు పానీయాలకు బానిసలుగా మారి విష సంస్కృతి కోరల్లో చిక్కుకుంటున్నారని, లాభాల కోసం యువతను మత్తులోకి తీసుకుని కేటుగాళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఉపాధి లేక నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. వెంటనే ఉద్యోగాలు నోటిఫికేషన్ ప్రకటించాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, అలాగే సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోవాలని, ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇద్దరికీ పెన్షన్ ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్స్ కూడా పెంచాలని, భూ నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ఉన్న ఎంతోమంది ఆదివాసీలకు కరెంటు, రోడ్డు , తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీల తోపాటు , సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రజా సమస్యల పరిష్కారానికి న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరన్న, చెన్నయ్య సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: