హైదరాబాద్: జిల్లాల అభివృద్ధికి అందరూ కలసి కట్టుగా పని చేయాలని ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించిన నేపథ్యంలో టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో జిల్లా పార్టీ నేతలు సీఎం కేసీఆర్ ను బుధవారం ప్రగతి భవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అశ్వారావుపేట మండలం కేంద్రం లో సెంట్రల్ డివైడర్, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలో ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఖమ్మం ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా సీఎం జిల్లా నేతలకు పలు కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా ప్రగతి కొరకు నిధులను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిందని గుర్తు చేశారు. అందుచేత, వచ్చే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యమత్యంగా కృషి చేయాలని పిలపునిచ్చారు.
సీఎంను కలిసిన వారిలో ప్రభుత్వ విప్-భద్రాద్రి కొత్తగూడెం పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ-ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ అభ్యర్థి బండి పార్థసారధి రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Post A Comment: