నారాయణపేట : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం డబ్బులున్నాయని ఒకాయన పాదయాత్రలు చేస్తూ అడ్డం పొడవు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
ఏ ఊరికి పోయినా చెట్లు, నల్లా కనెక్షన్లు కనబడుతున్నాయి. ఆసరా పెన్షన్లు అందుకుంటున్న అవ్వలు కనబడ్డారు.. రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంప్ యార్డులు కనబడుతున్నాయి.. ఈ పథకాలన్నింటిలో మా పైసలు ఉన్నాయని ఆయన అంటున్నాడు. మరి కేంద్రం పైసలే మన పథకాల్లో ఉంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు అమలు కావాలి కదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలోని రాయిచూర్లోకి పోదాం.. మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే.. మా పథకాలన్నీ అక్కడ చూపిస్తావా? ధైర్యం ఉందా? అని కేటీఆర్ సవాల్ చేశారు. ఉత్తమ గ్రామపంచాయతీలుగా మనవే టాప్ టెన్లో ఉన్నాయి. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ గ్రామాలు ఎందుకు ఎంపిక కావడం లేదు. గట్టిగా నిలదీస్తే హిందూ ముస్లిం, భారత్, పాకిస్తాన్ అంటరు. నేను చెప్పెదాంట్లో ఒక్కటంటే ఒక్క అక్షరం తప్పు ఉన్నా ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
గ్రూప్ -1 ఉర్దూలో రాస్తే తప్పేంటి?
గ్రూప్ -1 పరీక్షలు ఉర్దూలో నిర్వహించొద్దని కొంత మంది నాయకులు వాగ్వాదం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఉర్దూను అధికారిక భాషగా గుర్తించలేదా?యూపీఎస్సీతో పాటు కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఉర్దూ భాష లేదా? మరి అక్కడున్నప్పుడు లేని బాధ ఇక్కడెందుకు వస్తుంది. ఉర్దూను ఒక ముస్లిం భాష, మతం భాషగా చూడడమేనా? ఇదేనా నీతి. పిల్లల మనసుల్లో విషం నింపడమేనా? ఉర్దూలో రాస్తే తప్పేంటి? ఢిల్లీలో, మద్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉర్దూ భాషలో పరీక్షలు నిర్వహించొచ్చట. కొంత మంది నాయకులు దౌర్భాగ్యపు రాజకీయీలు చేస్తున్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి అని కేటీఆర్ సవాల్ చేశారు.
Post A Comment: