ములకలపల్లి:మన్యం మనుగడ :
మండల కేంద్రంలో, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు అమరుడు కామ్రేడ్ కుంజా లక్ష్మణరావు సంతాప సభ కు న్యూడెమోక్రసీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని,భద్రాద్రి కొత్తగూడెం సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు పిలుపునిచ్చారు.కామ్రేడ్ లక్ష్మణరావు సంతాపసభ కరపత్రాలను పాల్వంచ పట్టణంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వంకా సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆవునూరి మధు మాట్లాడుతూ, కామ్రేడ్ కుంజా లక్ష్మణరావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం పార్టీకి తీరని లోటని,కామ్రేడ్ లక్ష్మణరావు 90వ దశకం చివరిలో పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా జీవితాన్ని ఎంచుకొని, ములకలపల్లి మండలం లో న్యూడెమోక్రసీ ఆర్గనైజర్ గా ప్రజల తలలో నాలుకలా పనిచేశాడని, పోడు భూములు ఆదివాసీ పేదలు సాగు చేసుకునేందుకు పోరాట కర్తవ్యాలను రూపొందించడం తో పాటు,వాటిని అమలు చేయడంలోనూ అగ్రభాగాన నిలిచాడని కొనియాడారు. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి నారాయణరావు భూస్వామీపై పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించాడని,అనేక నిర్బంధాలను,కేసులను సైతం ఎదుర్కొని, అనేకసార్లు జైలుకు వెళ్లాడని,ఈ ప్రాంతంలో ప్రజల మధ్య వచ్చే సమస్యలను ఎంతో నేర్పుతో పరిష్కరించే వాడని తెలిపారు.పార్టీ నిర్మాణ సూత్రాలకు కట్టుబడి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ విప్లవ రాజకీయాలను దృఢ విశ్వాసంతో బలపరిచాడని,అందరితో స్నేహపూర్వకంగా కలిసిపోయి, నిరాడంబరంగా కమ్యూనిస్టు ఆదర్శాలను పాటించాడని గుర్తు చేశారు.కామ్రేడ్ లక్ష్మణరావు మరణం న్యూడెమోక్రసీ పార్టీ కి తీరని లోటని తెలిపారు.కామ్రేడ్ నమ్మిన న్యూడెమోక్రసీ ప్రతిఘటన పోరాట విప్లవ రాజకీయాలను ముందుకు తీసుకుపోయేందుకు, ప్రతి కార్యకర్త , న్యూడెమోక్రసీ శ్రేణులు కృషి చేయాలని , ఆ అమరుడి ఆశయాలను స్మరించుకుంటూ, ఈ నెల 22న ములకలపల్లి మండల కేంద్రంలో జరగనున్న కామ్రేడ్ లక్ష్మణరావు సంతాప సభ కు, న్యూడెమోక్రసీ శ్రేణుల తో పాటు, శ్రేయోభిలాషులు, ప్రజాస్వామిక వాదులు, మిత్రులు అందరూ హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు మోరా రవి, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు గౌని నగేశ్, అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఉమా,మండల నాయకులు వంకా సురేష్,
తాటి తిరుపతయ్య, ఆదినారాయణ, ముదిగొండ మల్లయ్య, పొడుగు నరసింహారావు , ప్రసాద్,రమేష్,అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు వైయస్ రెడ్డి,బద్రు,దూలయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: