మన్యం మనుగడ, ములకలపల్లి:
ములకలపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ప్రతిఘటన పోరాట, ఆదివాసీ ముద్దుబిడ్డ, కామ్రేడ్ కుంజా లక్ష్మణరావు సంతాప సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు న్యూడెమోక్రసీ శ్రేణులకు, మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుంజా లక్ష్మణరావు మంచి గా సభ విజయవంతం చేయాలని కోరుతూ గురువారం పార్టీ కార్యకర్తలతో కలిసి, ములకలపల్లి మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవునూరి మధు మాట్లాడుతూ ఫిబ్రవరి 6న కామ్రేడ్ కుంజా లక్ష్మణరావు మూక మామిడి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఫిబ్రవరి 7న ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆ కామ్రేడ్ మరణం కుటుంబానికి న్యూడెమోక్రసీ పార్టీకి తీరని లోటు అన్నారు. కామ్రేడ్ లక్ష్మణరావు, ఆశయాలకు అసువులు ధారపోసిన అమరవీరుల బాటను చేపట్టాడని, ములకలపల్లి ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారానికై, రెండు దశాబ్దాలకు పైగా అలుపెరగని కృషి చేశాడని అన్నారు. ఈ ప్రాంతంలో ఫారెస్ట్ వారి దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడి, ఆదివాసీ, గిరిజన, పేద ప్రజలకు వేలాది ఎకరాల భూములు సాధించి పెట్టడంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించాడని తెలిపారు, హక్కులను నినదించి, దిక్కులను ఎరుపెక్కిoచే నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంతో, సరికొత్త సమాజం కోసం పోరాడిన యోధుడు లక్ష్మణరావు అని కొనియాడారు. తన దీక్ష, దక్షత దిక్సూచి కావాలని, తన అనుభవాలు మనలను కార్యోన్ముఖులను చేయడానికి, లక్ష్మణరావు అమరత్వం సాక్షిగా,
శుక్రవారం ములకలపల్లి మండల కేంద్రంలో జరిగే సంతాప సభకు ప్రజలు కదిలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ కె ఉమర్, డివిజన్ నాయకులు మోరా రవి, ఐ ఎఫ్ టి యు అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, జక్కుల రాంబాబు, ములకలపల్లి మండల నాయకులు పొడుగు నరసింహారావు, తాటి తిరుపతయ్య, రాజు, ఆదినారాయణ, ముదిగొండ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: