మణుగూరు ప్రభుత్వ 100 పడకల హాస్పటల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వంద పడకల హాస్పటల్ ను సందర్శించారు. అనంతరం స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ప్రభుత్వ 100 పడకల హాస్పటల్ లో పూర్తిస్థాయి వైద్యుల నియమించి, ఏజెన్సీ ప్రజలకు 24 గంటలు వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ఏరియా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు నిర్వహించిన ఫలితంగా కొంత మంది వైద్యులను నియమించి ప్రజలకు వైద్య సేవలు అందించడం, పోస్టుమార్టం సౌకర్యం కూడా కల్పించడం అభినందించదగ్గ విషయమే అయినప్పటికీ, హాస్పటల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం అన్నారు. హాస్పటల్లో సిబ్బంది కూర్చోవడానికి కనీసం ఫర్నిచర్ కూడా లేదని విమర్శించారు. అదేవిధంగా గైనకాలజిస్ట్ డాక్టర్ ఉన్నప్పటికీ ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ గాని, ఎమర్జెన్సీ పరికరాలు గాని లేవన్నారు. ఎమర్జెన్సీ మందులు కూడా లేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు మణుగూరు వంద పడకల ఆసుపత్రి పై దృష్టి కేంద్రీకరించి మణుగూరు ప్రభుత్వ వంద పడకల హాస్పిటల్ లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ గారు సూచించినట్లు డాక్టర్లు సమయపాలన పాటించాలని కోరారు. ప్రభుత్వం మణుగూరు వంద పడకల హాస్పిటల్ లో పూర్తిస్థాయి వైద్యులను నియమించి, పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించి ఏజెన్సీ నియోజకవర్గ ప్రజలకు 24 గంటల వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేక పోతే తమ పార్టీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే అన్ని పార్టీలను, సంఘాలను కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామన్నారు.
ఈ సమావేశం లో సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా మణుగూరు సబ్ డివిజన్ నాయకులు ఎండీ. గౌస్, యాకయ్య, సంజీవరెడ్డి, వెంకటేశ్వర్లు, జానయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: