హైదరాబాద్ : ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా.. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ దేశంలోని నీటి వనరులపై ప్రసంగించారు.
ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉన్న నీటి లభ్యత 65 వేల టీఎంసీలు అని కేసీఆర్ తెలిపారు. మరో నాలుగైదు టీఎంసీల లెక్క తేలాల్సి ఉంది. ఇది అంతర్జాతీయ గొడవల్లో ఉంది. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుల ద్వారా 29 వేల టీఎంసీలు మాత్రమే దేశం వాడుకుంటోంది. దేశంలో ఎక్కడా చూసిన నీటి యుద్ధాలే. దీనికి కారణం ఎవరు. 65 వేల టీఎంసీల నీరు ఉండి కావేరి జలాల కోసం తమిళనాడు – కర్ణాటక మధ్య యుద్ధం, సింధూ – సట్లెజ్ జలాల కోసం రాజస్థాన్ – హర్యానా మధ్య యుద్ధం ఏర్పడిందన్నారు.
తాగునీళ్లకు కూడా ఈ దేశం నోచుకోవడం లేదు..
కనీసం తాగునీళ్లకు కూడా ఈ దేశం నోచుకోవడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యలున్నాయి. కరెంట్ కోతలున్నాయి. మాటలు చెప్తే మైకులు హోరెత్తుతున్నాయి. వాగ్దానాల హోరు.. పనిలో జీరో. మౌలిక వసతులు లేవు అని కేంద్రాన్ని విమర్శించారు. తాగడానికి నీల్లు లేని దుస్థితిలో ఈ దేశం ఉంది. ఇది ఎవరి అసమర్థత. ఈ సమస్యలు పరిష్కరించబడాలి. ఇందుకోసం జరిగే ప్రస్థానంలో, ప్రయత్నంలో ఉజ్వలమైన పాత్ర మన రాష్ట్రం పోషించాలని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇది కఠోరమైన వాస్తవం.. నిప్పులాంటి నిజం..
ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో అత్యధిక యువశక్తి ఉందని కేసీఆర్ తెలిపారు. 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. భారత పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే.. ఇక్కడ వారి తల్లిదండ్రులు పార్టీలు చేసుకుంటున్నారు. ఏమిటీ ఈ దౌర్భాగ్యం. అన్ని వనరులు ఉండి ఈ దేశం ఎందుకు కూనారిల్లుతుంది. దీని మీద అందరం ఆలోచించాలి. ప్రజా జీవితంలో పని చేస్తున్నాం కాబట్టి.. ఈ దేశానికి పట్టిన దుస్థితిని తరిమేయాలి. మట్టి, నీళ్లు లేని సింగపూర్ ఆర్థిక పరిస్థితిలో నంబర్ వన్లో ఉందన్నారు. మంచినీల్లు కూడా మలేషియా నుంచి కొంటారు. అన్నం ముద్ద కూడా వారిది కాదు. ఆ దేశంలో ఏమి లేదు.. కానీ ఆర్థిక స్థితిలో నంబర్ వన్గా ఉంది. మన దగ్గర అన్ని ఉన్నాయి కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదు. ఇది కఠోరమైన వాస్తవం.. నిప్పులాంటి నిజం అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
Post A Comment: