మన్యం మనుగడ, మంగపేట.
ఆదివాసీ ,దళిత , గిరిజన, బహుజన ఆరాధ్య దైవాలు అయిన సమ్మక్క సారలమ్మలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్ జీయర్ స్వామి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండం లొనే అతిపెద్ద కుంభమేళా మేడారం ,కులమతాలకు అతీతంగా ఆరాధించే వనదేవత లైన సమ్మక్క సారలమ్మలను వాళ్ళు ఏమైనా దేవతలా దేవలోకం నుండి దిగి వచ్చారా అని కించపరుస్తూ చిన జీయర్ స్వామి ఒక టీవీ చానల్ వేదికగా మాట్లాడడాన్ని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.నోరు అదుపు లేకుండా తన ఇష్టానుసారంగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క,సారక్క దైవాల మీద చిన్న జీయర్ స్వామి గిరిజన దేవతా మూర్తులను అవమానించిన చిన జీయర్ స్వామి పై ఎస్సి,ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.ఆశ్రమాలు, ఆధ్యాత్మికత పేరిట వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను గుప్పిట్లో పెట్టుకుని చిన జీయర్ స్వామి రాజకీయం చేస్తున్నారని, తన సమతా మూర్తి పర్యాటక కేంద్రాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్న అక్కసుతోనే సమ్మక్క సారక్కలపై అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. ఆత్మగౌరవ పోరాటానికి సూచికలైన వన దేవతలు సమ్మక్క సారక్క విమర్శిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. సమతామూర్తి పేరుతో 200ఎకరాల పొలం ఆక్రమించి,1000 కోట్లు ఖర్చు పెట్టి,216 అడుగుల పంచంలోహం విగ్రహం పెట్టి అది చూడటానికి కూడా రూ 150 టికెట్ పెట్టి, మహా యాగం అని చెప్పి 1035 హోమగుండాలు ఏర్పాటు చేసి ఆ యాగం లో 2 లక్షల కేజీ ల ఆవునెయ్యి తో అద్భుతమైన యాగం చేసినట్లు దేశాన్ని యావత్తు ఆకర్శించి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. మా ఇలవేల్పు మా తల్లుల దగ్గర ఎటువంటి టికెట్ లేదు అని, సమ్మక్క సారలమ్మ దగ్గర ఎలాంటి వ్యాపారం జరగదని అన్నారు. లక్ష రూపాయలు తీసుకోకుండా మీరెప్పుడైనా పేద వారి ఇంటికి వెళ్ళారా అని ప్రశ్నించారు. చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న జీయర్ స్వామి సమ్మక్క, సారక్కలను వ్యతిరేకించడం అంటే తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల అవమానించడమే అవుతుందని ఇప్పటికైనా గిరిజనులకు గిరిజన దేవతలైన సమ్మక్క సారక్క కు క్షమాపణ కోరుకుని మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే గిరిజన సంఘాలను, ప్రజాసంఘాలను ప్రజలను కలుపుకొని మాల మహానాడు ఆధ్వర్యంలో ముచ్చింతల ఆశ్రమాన్ని ముట్టడిస్తామని ఆయన డిమాండ్ చేశారు.
Post A Comment: