- తన బోధనా జ్ఞానంతో తెలుగు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన విద్యార్థులు
- పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాండురంగాపురం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చాంద్ బేగం
మన్యం మనుగడ, పినపాక:
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా తనదైన శైలిలో విద్యాబోధన చేస్తూ విద్యార్థులలో గల నైపుణ్యాలను వెలికి తీస్తూ, ఆదర్శవంతమైన ఉపాధ్యాయురాలిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు పినపాక మండలం.. పాండురంగాపురం ప్రాథమికోన్నత పాఠశాల కు చెందిన ఉపాధ్యాయురాలు చాంద్ బేగం. బోధనా జ్ఞానం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులను నూతనంగా ఆలోచించే విధంగా తయారుచేస్తూ, తనదైన శైలిలో విద్యను అందిస్తున్నారు. పాఠశాలలకు కొద్ది రోజుల క్రితమే వచ్చినప్పటికీ, విద్యార్థులకు చక్కటి బోధనను అందించి, వారి ప్రతిభాపాటవాలను గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు ఈ ఉపాధ్యాయురాలు.
పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బిజ్జా సన భారతదేశ పటంలో రాష్ట్రాలను చూడకుండా గుర్తించి రాయగల సామర్థ్యాన్ని ఉపాధ్యాయురాలు చాంద్ బేగం విద్యా బోధన తో నేర్చుకుని 4.48 సెకండ్లలో రాయి గలిగింది. ఐదవ తరగతి చదువుతున్న ఈసం దీపిక వర్ణమాలను ఐదు భాషలలో(తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, కన్నడ)7.40 సెకండ్లలో రాయ గలిగింది. మూడవ తరగతి చదువుతున్న ఏడూళ్ళ శాన్వి హిందీ భాషలో ఒకటి నుండి 12 వరకు గల ఎక్కాల ను12.54 సెకండ్లలో రివర్స్ ఆర్డర్ లో రాయ గలిగింది.ఒకటవ తరగతి చదువుతున్న ఏడూళ్ల సిద్ధార్థ 1 నుండి 10 ఎక్కాలను పై నుండి కిందికి, కింది నుండి పైకి13.18 సెకండ్లలో పూర్తి చేశాడు. ఆరవ తరగతి చదువుతున్న బొజ్జా లోక్ సాయి తనీష్,1 నుండి 15 వరకు గల హిందీ ఎక్కాలను12.22 సెకండ్ లో పూర్తి చేశాడు. ఆరవ తరగతి చదువుతున్న బొజ్జా అభిలాష్ 1 నుండి 15 వరకు ఎక్కాల ను12.43 సెకండ్లలో అద్దంలో కనపడే విధంగా (మిర్రర్ ఇమేజ్)రాసి ఆశ్చర్యపరిచాడు. ఈ విధంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయురాలి బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూనే అద్భుత ప్రతిభను కనబరిచారు. ఈ కారణంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ విద్యార్థులకు స్థానం లభించింది. సోమవారం రోజున పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా వారికి, ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు .ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులలో గల జ్ఞానాన్ని గుర్తించి,బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన ఉపాధ్యాయురాలు చాంద్ బేగం గురించి పలువురు చర్చిస్తూ, అభినందిస్తున్నారు.
Post A Comment: