ములకలపల్లి:మార్చి13:(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:
మానవుల హృదయాల్లో నిజమైన దైవ భావన జనించినట్లయితే,సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయని,జమాతె ఇస్లామీ హింద్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ఉమర్8 ఫారూఖ్ అన్నారు.ములకలపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,పరస్పర సహకారంతో సమాజం సుభిక్షంగా వర్ధిల్లుతుందని, శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయని, నైతిక విలువలు వికసిస్తాయని తెలిపారు.సీనియర్ జర్నలిస్టు యండి. ఉస్మాన్ ఖాన్ మాట్లాడుతూ నేటి కాలంలో చాలామంది ప్రజలు ప్రాపంచిక జీవితమే సర్వస్వం అనే భ్రమలో పడి మంచీ చెడులను,మరచి ధర్మాధర్మాలను పట్టించుకోవడం లేదన్నారు.చావు పుట్టుకల మధ్యనున్న ఈచిన్న జీవితం కేవలం పరీక్షా సమయం మాత్రమేనని, పోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్లలేమని తెలిపారు.చావూ పుట్టుకల మధ్యనున్న ఈ చిన్నపాటి జీవితంలో సాధ్యమైనంత మేర మంచి పనులు చేయాలని, చేతనయితే నలుగురికీ ఉపయోగ పడాలని సూచించారు.సృష్టిలోనే ఉత్తమమైన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోకపోతే జీవితానికి అర్ధం-పరమార్ధం లేకుండా పోతుందని, సమాజంలో ఉన్నటువంటి అన్నివర్గాల ప్రజలు తమ మూలంరిత్యా ఒకటేనని, కులమతాల అడ్డుగోడలు సామరస్య జీవనానికి ఆటంకాలుగా మారకూడదన్నారు.సాటిమానవులు,ఇతర జీవరాసుల పట్ల మనసులో ప్రేమ భావాలు,ఊట చెలమలుగా ఉప్పొంగాలని, అప్పుడే ఎటువంటి మనోవికారాలకు తావులేకుండా, శారీరక ఆరోగ్యంతోపాటు,ఆత్మకూడా ఆరోగ్యంగా,సజీవంగా ఉంటుందన్నారు.చెడు ఆలోచనలవల్ల శారీరక ఆరోగ్యం ప్రభావితమవుతుందని,మనసు నిర్మలంగా లేకపోతే అనేక మానసిక రుగ్మతలు దాపురిస్తాయన్నారు. పరులపట్ల మనసులో ద్వేషభావాలుంటే, దేహంలో ప్రాణమున్నా ఆత్మ నిర్జీవమవుతుందన్నారు.ఎలాంటి తారతమ్యాలకూ తావు లేకుండా అందరినీ ప్రేమించగలిగితే అంతకుమించిన ధర్మం మరొకటి ఉండదని,ప్రతి ఉదయం మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలని సూచించారు. మానసిక ప్రశాంతతకు అంతకు మించిన మార్గం మరొకటి లేదన్నారు. కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షులు షరిఫ్ ఆలం,మౌలానా అఫ్జల్,అబ్దుస్సమద్,సికిందర్, రిజ్వాన్,ముర్తుజా,అస్లంఖాన్ , షరీఫ్,మొయినుద్దీన్,గౌసుద్దీన్,రఫీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: