మన్యం టీవి వెబ్ న్యూస్:
కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన 39లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ స్థూలంగా ప్రజాసంక్షేమాన్ని ఫణంగా పెట్టింది.39లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని ఫణంగా పెట్టింది. తెలంగాణా రాష్ట్రానికి ద్రోహం తలపెట్టింది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం తాజా బడ్జెట్లో అవసరమైన చర్యలు చేపట్టలేదు. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ నిర్మాణానికి ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి చేత శంఖుస్థాపన చేయించారు. ఈ రోజేమో గుజరాత్లో గిఫ్ట్ సిటీ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పని చేస్తుందని బడ్జెట్ సాక్షిగా ప్రకటించటం తెలంగాణ ప్రజలను మోసగించటమే అవుతుంది. తెలంగాణ ఆదివాసీ విశ్వవిద్యాలయాన్ని మాటమాత్రంగా బడ్జెట్లో పేర్కొని, రెండు రాష్ట్రాలకూ కలిపి కేవలం 43 కోట్లు కేటాయించారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి గానీ, రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లోఉన్న రైల్వేలైన్లు పూర్తిచేయటానికి గానీ, ఖాజీపేట కోచ్ఫ్యాక్టరీ గురించి ఈబడ్జెట్లో ప్రస్తావన కూడా కరువైంది.
ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం పెట్టిన ఖర్చుతోపోలిస్తే దాదాపు నాల్గోవంతు కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రు.98 వేల కోట్ల రూపాయలు ఈ పథకం కింద ఖర్చు చేసినట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడిస్తుంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేవలం రు.73 వేల కోట్ల రూపాయలకు తగ్గించింది.నదుల అనుసంధానం పథకాన్ని గొప్పగా ప్రకటించినా బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఈ గొప్పలు కనిపించలేదు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ముప్పు తొలగిపోలేదని అంతర్జాతీయ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీ చేస్తున్నా దేశంలో కోవిడ్ అత్యవసర సేవలకు కేటాయింపులు లేకపోవటం ఆందోళన కలిగించే అంశం.అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక విద్యాకేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించినా ఆ మేరకు కేటాయింపులు లేవు.
2025 నాటికి దేశ జనాభాలో సగానికి సగం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని అంచనా వేసినా పట్టణ ప్రాంత మౌలిక వసతులు కల్పించేందుకు ఉద్దేశించిన అమృత్ పథకానికి తదనుగుణంగా కేటాయింపులు లేకపోవటం, పట్టణ ప్రాంత పేదలకు ఇచ్చే వడ్డీ రాయితీల్లో కోత విధించటం ఈ బడ్జెట్లో పట్టణ ప్రాంత పేదల పట్ల కేంద్రానికి ఉన్న నిర్లక్ష్య భావన స్పష్టంగా వెల్లడవుతుంది.
సాగునీటి వసతి కల్పిస్తే స్థూలజాతీయోత్పత్తి రెండు శాతం అదనంగా పెరిగే అవకాశం ఉందని ఆర్ధికవేత్తలు చెబుతున్నా సాగునీటిపారుదల రంగానికి కేటాయింపులు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదు. మౌలికసదుపాయాల రంగానికి 30 శాతం పెంచామని గొప్పగా చెప్పుకుంటోంది ఈ పెరుగుదల స్థూలంగా సంక్షేమరంగాన్ని ఫణంగా పెట్టి కేటాయించిన నిధులే.
మొత్తంగా బడ్జెట్ పరిమాణం ఐదు శాతం పెరిగిందనుకున్నా ఆ మేరకు సంక్షేమ వ్యయం పెరగకపోవటం గమనించాల్సిన విషయం. కేపిటల్ ఖర్చు పేరుతో ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఉపాధి పెంచేదిగా లేదు.
ఆత్మనిర్భర రక్షణ రంగం నినాదంతో దేశీయంగా రక్షణరంగానికి కావల్సిన ఆయుధాలు, ఇతర సేవలు అందించే దేశీయ ప్రైవేటురంగం నుండి రక్షణ శాఖ మెజారిటీ కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని షరతు విధించటం కేవలం రక్షణ రంగంలోకి ప్రవేశిస్తున్న ప్రైవేటు రంగానికి లాభాలు గ్యారంటీ చేసే ప్రయత్నమే తప్ప మరోటి కాదు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలని, రాష్ట్రానికి జరిగిన ద్రోహాన్ని నిరసించాలని సిపిఐ(ఎం) జయశంకర్ భూపాలపల్లి కమిటీ పిలుపునిస్తున్నది.
Post A Comment: