- మామతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న తల్లి.
- ఆ దృశ్యాన్ని చూసిన కన్నకూతుర్ని హతమార్చిన తల్లి, తాత..
- చిన్నారి హత్యలో నడిచిన హైడ్రామా,
- చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
- చిన్నారి హత్య కేసు వివరాలు వెల్లడించిన వైరా ఏసీపీ స్నేహ మెహ్రా
తల్లి, తాతల మధ్య అక్రమ సంబంధం ముక్కుపచ్చలారని చిన్నారి జీవితాన్ని చిదిమేసింది. మానవ సంబంధాల మధ్య ఉన్న వావివరుసలు మరచిన తల్లి, తాత సభ్య సమాజం తలదించుకునేలా చిన్నారి జీవితాన్ని మొగ్గలోనే తుంచి వేశారు. తమ మధ్య కొనసాగుతున్న గుట్టును బయటపెడుతుందనే పాశవిక ఆలోచనతో చిన్నారి పాలిట మృత్యువుగా మారారు. వివరాల్లోకి వెళితే బోనకల్ మండల కేంద్రంలో ఈనెల 8వ తేదీన పాలెపు హరికృష్ణ, సునీత దంపతుల కుమార్తె పాలెపు మహాదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మృతిపై చిన్నారి తల్లి, తాతలు సినిమా ఫక్కీలో హైడ్రామా నడిపించారు. చిన్నారి పాఠశాలలో క్రింద పడిందని, ఫిట్స్ తో అస్వస్థతకు గురైందని, ఆ కారణం చేతనే మరణించిందని అందరిని నమ్మబలికారు. కానీ చిన్నారి మెడ కింద కమిలిన గాయాలు ఉండటంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చిన్నారి చావుకు కారణమైన తాత తనలో ఉన్న నటుడిని మరోసారి వెలికి తీశాడు. హత్య ఉదంతం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో తన చిన్నారిని పోస్టుమార్టం చేయవద్దని, మృతదేహాన్ని ఇలాగే అప్పజెప్పాలని మొసలి కన్నీరు కార్చాడు. దీంతో పోలీసులలో అనుమానం మరింత బలపడింది. మిస్టరీగా మారిన చిన్నారి మృతి అనే పత్రికా కథనాలు పోలీసుల విచారణకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీంతో వైరా సిఐ మురళి, స్థానిక ఎస్ఐ తేజావత్ కవిత తమదైన శైలిలో విచారణ చేపట్టగా చిన్నారి మృతి వెనుక దాగి ఉన్న మేక తోలు కప్పుకున్న మృగాలు ఎవరు అనే అసలు వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ఈ ఉదంతంపై వైరా ఏసీపీ స్నేహామెహ్రా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి నిజా నిజాలు వెల్లడించారు. చిన్నారి తల్లి సునీత, తాత పాలెపు నరసింహారావులు తమ మధ్య ఉన్న అక్రమ సంబంధంతో గదిలో ఉండగా అనుకోకుండా ఆ చిన్నారి గమనించింది. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని అనడంతో తల్లి, తాత వద్దని వారించారు. వినక పోవడంతో చేయి చేసుకున్నారు. తమ ఈ మధ్య ఉన్న గుట్టు రట్టు అవుతుందనే భయంతో ఆందోళనతో రక్తసంబంధం మరచి చిన్నారిని చంపేందుకు పూనుకున్నారు. చున్నీ తో చేతులు కాళ్ళు కట్టి పడవేసి, ఇంటిలో ఉన్న విద్యుత్ సర్వీస్ వైరును మెడకు చుట్టి చెరోవైపు పట్టుకొని గట్టిగా లాగి చిన్నారిని బలి తీసుకున్నారు. చిన్నారి మహాదేవి జీవితాన్ని కడతేర్చి, చట్టం కళ్లుగప్పి దర్జాగా సమాజంలో తిరిగేద్దామనుకున్నారు. కానీ ఖాకీలు కదం తొక్కారు. మిస్టరీని ఛేదించారు. అడవి మృగాలు అయిన తల్లి, తాతల ఆట కట్టించారు. నిందితులకు సెక్షన్, 302, 201 రెడ్ విత్ 34, ఐపిసి క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
*మిస్టరీని వారంలో చేధించిన పోలీసులు*
మిస్టరీగా మారిన చిన్నారి మహాదేవి హత్యకేసును మధిర సిఐ ఓ.మురళి, స్థానిక ఎస్ఐ తేజావత్ కవిత తమదైన శైలిలో విచారణ చేపట్టి కేవలం వారం రోజుల్లోనే హత్య ఉదంతాన్ని ఛేధించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్థానిక ఎస్ఐ తేజావత్ కవిత సీఐ మురళి ఆధ్వర్యంలో ఈ హత్య కేసును ఛేదించడం అభినందించదగ్గ విషయమని ఏసీపీ స్నేహా మెహ్రా అభినందనలతో ముంచెత్తారు. ఈ కేసు విచారణలో సహకరించిన హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ చౌదరి, సీఐ రైటర్ వంగాల నాగేశ్వరరావు, డీ సత్యంబాబు, శాంత కుమార్ లకు వైరా ఎసిపి అభినందనలు తెలిపి నగదు రివార్డును అందజేశారు..
Post A Comment: