ములకలపల్లి:మన్యం మనుగడ (న్యూస్):అట్టడుగు వర్గాలను విద్యకు దూరం చేసినా,అజ్ఞాన సమాజంలో విద్యాభివృధ్ధికి అలుపెరుగని పోరాటం చేసిన తొలితరం సంఘ సంస్కర్త, తొలి మైనారిటీ విద్యావేత్త ఫాతిమా షేక్ అని సీనియర్ జర్నలిస్ట్ యండి. ఉస్మాన్ ఖాన్ అన్నారు. సావిత్రిబాయి పూలేతో కలిసి సంఘసంస్కరణకోసం, ముఖ్యంగా దళితులు, మహిళల విద్యాభివృధ్ధికోసం పనిచేశారన్నారు. పూలే దంపతులను వారి కుటుంబ సభ్యులు ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు వారిని అక్కున చేర్చుకొని, తమ ఇంట్లో ఆశ్రయమిచ్చి, ఏకంగా తమ ఇంటినే పాఠశాలగా మార్చిన గొప్ప మానవతావాది అని కొనియాడారు.శూద్రులు చదువుకోకూడదని మనువాదులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఫాతిమా, సావిత్రీ ఏమాత్రం భయపడకుండా వారిని ఎదిరించి బహుజనులందనీ చైతన్యపరిచి, వారికి అక్షర జ్ఞానం ప్రసాదించారన్నారు. 1848 లో సోదరుడు ఉస్మాన్ షేక్ సహకారంతో జ్యోతీరావుపూలే , సావిత్రీబాయి, ఫాతిమా షేక్ లు దళితులు, మహిళల కోసం విద్యాసంస్థను నెలకొల్పారని, ఆ క్రమంలో వారు మనువాదులు, మతోన్మాదులనుండి అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, అనేక దశాబ్దాల పోరాటం తరువాత సావిత్రీబాయి పూలేకు తగిన గుర్తింపు లభించిందని,ఫాతిమా షేక్ ఇంకా విస్మృత విద్యావేత్తగానే మిగిలి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు బహుజనులు విద్యాపరంగా అంతో ఇంతో ముందడుగు వేస్తున్నారంటే అది సావిత్రీబాయి, ఫాతిమా షేక్ ల పుణ్యమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా సమాజం సావిత్రితో పాటు ఫాతిమానూ స్మరించుకోవలసిన అవసరముందన్నారు.
Post A Comment: