- దేశం ప్రగతి పథంలో పురోగమించాలి.
- ప్రముఖ రచయిత యండి. ఉస్మాన్ ఖాన్ ఆకాంక్ష
ములకలపల్లి:డిసంబర్31:మన్యం మనుగడ:(న్యూస్):
కోటి ఆశలతో కొత్తసంవత్సరంలోకి అడుగుపెట్టిన సమస్త జనుల కోరికలు నెరవేరాలని ప్రముఖ రచయిత, కాలమిస్టు యండి. ఉస్మాన్ ఖాన్ ఆకాంక్షించారు.చూస్తూచూస్తూనే కాల గమనంలో మరో యేడాది గడిచిపోయిందని,గడిచిన కాలం నుండి గుణపాఠం నేర్చుకొని, భవిష్యత్తును బంగారుమయం చేసుకొనే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.శుక్రవారం జగన్నాథపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఆశలు, ఆశయాలు, బాసలతో ఇరవై ఒకటి లోకి ప్రవేశించినవారు తమ ఆశలను,ఆశయాలను ఏమేరకు సాకారం చేసుకున్నారోగాని, కాలమైతే తనకేమీ సంబంధమే లేనట్లు అప్రతిహతంగా సాగిపోయిందన్నారు. నిరంతరం పరుగులు తీస్తున్న కాలం వెంట పరుగెత్తలేని వారుమరుగున పడిపోతారని,మహా మహులెందరో కాలగర్భంలో కలిసి పొయ్యారని, ఎవరూ కాలానికి అతీతులు కాదని ఆయన అన్నారు. కాలాన్ని లేక సమయాన్ని వినియోగిచుకోవడంపైన్నే జయాపజయాలు,సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయన్నారు.ఆకలి, పేదరికం,నిరక్షరాస్యత,నిరుద్యోగం, అవినీతి, అనైక్యత, సామాజిక అసమానతలు లేని సుందర సమాజంకోసం ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు.గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా, మరిన్ని మంచి కార్యాలు చేస్తూ, సమాజ సంక్షేమం, మానవ హితం, మానవీయ విలువల కోసం పాటుబడాలన్నారు. 2022 లో అందరికీ మంచి జరగాలని, సృష్టికంతటికీ సదా మేలే జరగాలని, యావత్ భూమండలంపై శాంతి నెలకొనాలని, ప్రేమ, సహనం, పరోపకారం, సోదరభావం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లాలని, మతోన్మాదం నశించి, మతసామరస్యం పరిఢవిల్లాలని, ఎల్లెడలా శాంతి నెలకొనాలని, దేశం ప్రగతి పథంలో పురోగమించాలని ఉస్మాన్ ఖాన్ ఆకాంక్షించారు. వైరస్ మహమ్మారి భయంనుండి మానవాళికి విముక్తిలభించాలని ఆశించారు. ఈసందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
Post A Comment: