👉 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం..
మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి మండల కేంద్రం వరకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన ర్యాలీలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తో పాటు పోలీసులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, యువకులు పాల్గొని, పోలీస్ అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ, పోలీస్ అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అంటూ నినదిస్తూ ర్యాలీ కొనసాగించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. అక్టోబర్ 21 అంటే పోలీస్ అమరవీరుల దినం,1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొట్టిన రోజు ఇది అన్నారు. ఈ సమరంలో ఎంతోమంది మన సైనికులు అమరుల అయ్యారని అన్నారు. ఆ రోజుని పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ, మానవహారం నిర్వహించిన, జూలూరుపాడు ప్రెస్ క్లబ్ మిత్రులకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ కార్తీక్, ఏఎస్ఐ తిరుపతి రావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాపట్ల మురళి, ప్రధాన కార్యదర్శి ఎస్ కె జానీ, సభ్యులు సత్యనారాయణ, పూర్ణ, పుల్లారావు, దుర్గ, కాసిం, వెంకన్న, సతీష్, వెంకట్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: