👉 త్రాగు నీటి నమూనాలు సేకరణ..
👉 వ్యాధిగ్రస్తుల ఆహారపు అలవాట్లు ఇతర అంశాలపై ఆరా..
👉 సమస్య మూలాలు కనిపెట్టగలరా..? పరిష్కారం దొరుకుతుందా..?
మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని బేతాళ పాడు గ్రామ పంచాయతీ లో గల పంతుల్ తండా, పీక్లా తండా, టాక్యా తండా లలో గత కొంత కాలంగా అనేకమంది గిరిజనులు కిడ్నీ వ్యాధి బారినపడి చనిపోగా, మరికొంతమంది దినదినగండంగా మందులు, డయాలసిస్ తో నెట్టుకొస్తున్నారు.ఈమధ్య ఈ అంశంపై వరసగా వచ్చిన వార్తా కథనాలతో స్పందించిన వైద్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. గ్రామంలోని చేతిపంపులు, మిషన్ భగీరథ, నీటి నమూనాలను సేకరించి, హైదరాబాద్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కిడ్నీ వ్యాధి సమస్య తో బాధపడుతున్న వారిని కలిసి వారి ఆహారపు అలవాట్లు, త్రాగే నీరు, జన్యుపరమైన సమస్యలు, ఇతర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు కొందరు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మా సమస్యలను పట్టించుకోవడం లేదని నిలదీశారు. గత అయిదారు సంవత్సరాల నుండి ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. గత ఆరు సంవత్సరాలుగా భయంకరమైన సమస్య ను ఎదుర్కొంటున్న ఈ ప్రాంత ప్రజల సమస్య మూలాలను కనిపెట్టి పరిష్కార మార్గం చూపాలని కోరుకుందాం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాందాస్, మండల వైద్యాధికారి డాక్టర్ వీరబాబు, సిహెచ్ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, డిఈ శివయ్య, ఎఈ కృష్ణవేణి, జిల్లా ల్యాబ్ ఇన్చార్జ్ రమా, ల్యాబ్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: