👉 యక్ష ప్రశ్నలతో తప్పించుకుంటున్న గ్రామస్తులు..
మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరోనా మహమ్మారిని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ,అన్ని శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కొంతమంది కుంటిసాకులతో తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురంలో గురువారం ఏఎన్ఎం ఆదిలక్ష్మి మరియు ఆశా జయమ్మ కరోనా టీకా తీసుకోని వారి ఇంటింటికి వెళ్లి టీకా లాభాలను వివరిస్తూ.. కరోనా టీకా అందరూ తీసుకోవాలని వెంటపడి అభ్యర్థిస్తున్నారు. అయినప్పటికీ కొందరు వీరిని యక్ష ప్రశ్నల తోటి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. టీకా వేసుకుంటే మా పనులు ఎవరు చేస్తారని, టీకా వేసుకుంటే మాకు ఏమీ కాదని మీరు రాసిస్తారా అని, అంటున్నారని అన్నారు. మొత్తం గ్రామంలో సుమారుగా 200 మందికి పైగా ఇంకా టీకా తీసుకోలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల సమన్వయంతోటి స్పెషల్ డ్రైవ్ ద్వారా నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయ్యాలని ఆదేశించినప్పటికీ మాకు ఎవరూ సహకరించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా మాకు అందరు సహకరించి కరోనా టీకాలను తీసుకోవాలని కోరారు.
Post A Comment: