CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

Share it:

 


ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

ఆఫ్ఘనిస్తాన్


07-09-2021


ʹ అఫ్ఘానిస్తాన్లో అమెరికాకు అవమానకరమైన ఓటమి


అమెరికన్ సామ్రాజ్యవాదులకు అఫ్ఘానిస్తాన్లో అవమానకరమైన ఓటమి ఎదురైంది. అఫ్ఘానిస్తాన్లో అమెరికా పరాజయం , అన్నింటికంటే ఎక్కువగా, సామ్రాజ్యవాదులు కాగితపు పులులనే విషయాన్ని, మరొకసారి ధృవీకరించింది. ఈ ఓటమి కేవలం అమెరికాకు మాత్రమే కాదు, అమెరికాతో అంటకాగుతూ, అఫ్ఘాన్ అంతర్గత వ్యవహరాల్లో తన లబ్దికోసం తలదూర్చిన భారత్ కు కూడా ఎదురైంది. ప్రస్తుతం భారత్ పరిస్థితి, దక్షిణాసియా దేశాలలో ఒంటరి కావడంతోపాటు, అఫ్హాన్ లో తాలిబన్లకు విజయం చేకూరడంతో, దాని పరిస్థితి ʹకుడితిలో పడ్డ ఎలుక చందమైందిʹ. ʹకాబూల్ʹలోని భారత దౌత్య సిబ్బందిని సురక్షితంగా విమానాలెక్కించడానికి కూడా, భారత భద్రతా సలహాదారు దోవల్ కు, అమెరికా పరపతి కావాల్సి వచ్చింది. ఇక అమెరికా పరిస్థితి చూస్తే, అర్ధరాత్రి ʹబగ్రామ్ʹ స్థావరం నుంచి ఏ ప్రకటన చేయకుండానే బయలుదేరడం మొదలుకొని, తన దౌత్యవేత్తల, తనకు సహకరించిన పౌరుల తరలింపుకు పడిన పాట్లవరకు చూస్తే, 1975లో ʹసైగాన్ʹ నుంచి అమెరికా సేనల అత్యంత దయనీయమైన ఉపసంహరణ దృశ్యమే, పునరావృతం అయినట్లుగా కనిపిస్తుంది.


ఇటువంటి అవమానకరమైన ఓటములు అమెరికాకు కొత్తేమికాదు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో, అమెరికన్ సామ్రాజ్యవాదులు, తమ ఆర్థిక వ్యవస్థను ʹయుద్ధ ఆర్థికవ్యవస్థʹగా మార్చి, దేశాన్ని ప్రాణాంతకమైన మారణాయుధాల ʹఉత్పత్తి హబ్ʹగా చేసారు. ఈ ప్రాణాంతకమైన మారణాయుధాలను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేయడంతోపాటు, ప్రపంచాధిపత్యం కోసం, ఒక ప్రతీఘాతుక వ్యూహాన్ని రూపొందించారు. ఈ వ్యూహంలో భాగంగానే, ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న అనేక స్థానిక యుద్ధాలకు కారణమైనారు. ఈ యుద్ధాలలో రాజకీయంగా, సైనికంగా జోక్యం చేసుకుంటూ, వాటిపై తమ అధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించారు.


ఈ క్రమంలోనే వియాత్నంలో చావుదెబ్బ తిన్నారు. సిరియాలో వెనుకడుగేసారు. ప్రస్తుతం అఫ్లాలో, అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఈ ఓటమిని అంగీకరించేందుకు సిద్ధపడకుండా, 2011లో ఒసామాబిన్ లాడెన్ ను హతమార్చడంతో మా లక్ష్యం నెరవేరిందని భేషజాలకు పోతున్నాడు. మరి 2011లోనే తమ లక్ష్యం నెరవేరినట్లయితే, 2021 దాకా అఫ్ఘాన్లో, అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఎందుకున్నాయనే ప్రశ్నకు మాత్రం, బైడెన్ వద్ద సమాధానం లేదు. .


అమెరికా గత 20 సంవత్సరాలుగా, అఫ్ఘాన్ లో తన కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పరిచి, ప్రజల ఆకాంక్షలను తొక్కిపడుతూ వచ్చింది. అయితే తాలిబన్ల, ప్రజల ప్రతిఘటనతో, దేశంపై పూర్తిస్థాయి పట్టును సాధించలేకపోయింది. తాలిబన్లకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో, అమెరికా కోటి 68 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2,322 మందికి పైగా సైనికులను కోల్పోయింది. ఇతర నాటో సైనిక బలగాలకు జరిగిన నష్టాన్ని కూడా కలిపితే, ఈ సంఖ్య 4,000 కు పైగానే ఉంటుంది. ఈ ఘర్షణలలో వేలాదిమంది అమెరికా, నాటో సైనికులు క్షతగాత్రులైనారు.


మరోవైపు ఈ కాలంలో అమెరికా నేతృత్వంలోని ʹనాటో బలగాలుʹ అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్లలో జరిపిన దాడులలో, రెండున్నర లక్షల మంది ప్రజలు చనిపోయారు. వేలాది మంది దేశంలోనే స్థానాంతరం చెందడంతోపాటు, విదేశాలకు కాందిశీకులుగా వెళ్ళారు. ఇంతటి విధ్వంసకాండ సృష్టించినప్పటికీ, అది తాలిబన్లను లొంగదీసుకోలేకపోయింది. అప్లాన్ ప్రజలపై విజయం సాధించలేకపోయింది.


అమెరికాకు సంభవించిన ఈ అవమానకరమైన ఓటమికి కారణాలుగా చూసినప్పుడు, అఫ్ఘాన్ ప్రజలు, అమెరికాను తమ శ్రేయోభిలాషిగా భావించకపోవడమే మొదటి, ప్రధాన కారణంగా ఉంది. వారు అమెరికాను తమపై అక్రమంగా దాడి చేసిన యుద్దోన్మాదిగానే చూసారు. దేశంలో, అమెరికాకు అనుకూలంగా ఉన్న ʹశిష్టవర్గాʹన్ని వాళ్ళెప్పుడు నమ్మలేదు. అమెరికా మద్దతుతో అధికారంలో ఉన్న ఈ ʹశిష్టవర్గాʹ (రాజకీయ, సైనిక నాయకత్వం, వారి అనుయాయలు)న్ని, అమెరికాకు కీలుబొమ్మలుగా, తొత్తులుగా మాత్రమే చూసారు. దీనికి తోడు అమెరికా, దాని తొత్తు సైనిక బలగాలు ప్రజలపై చేసిన సాయుధ దాడుల మూలంగా కూడా, ఈ పాలకవర్గాలపై ప్రజలకు ద్వేషం ఏర్పడింది.


ఈ కాలంలో, అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు తాలిబన్లను మట్టుబెట్టడం పేరుతో జరిపిన దాడుల్లో మహిళలు, పిల్లలతోపాటు, వేలాదిమంది ప్రజలు మరణించారు. చివరికి అమెరికా సాయుధ బలగాలు దేశాన్ని వీడిపోయే సమయంలో కూడా, అగస్టు చివరికి, టెర్రరిస్టులను మట్టుపెట్టడం పేరుతో జరిపిన డ్రోన్ దాడిలో, చిన్నపాపతోపాటు, అరుగురు ప్రజలు చనిపోయారు. ఈ మొత్తం మారణకాండ, అమెరికాపైనా, వారి తొత్తుల పైన ప్రజల అగ్రహానికి కారణమైంది. ఇక అమెరికా చెబుతున్నట్లుగా, అఫ్గాన్ లో ప్రజాస్వామ్యంʹ, ʹఅభివృద్ధిʹ ఉత్త బూటకపు నినాదాలుగానే మారాయి. అవినీతి విషయం చెప్పనక్కరనే లేదు. పాలకనేతల నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు ఎవరికి సాధ్యమైనంత వారు దండుకున్నారు. ప్రజల అవస్థలకు అంతేలేదు. చివరికి దేశాధ్యక్షుడు ఘనీ, దేశాన్ని వదిలి పారిపోతూ, పెద్దఎత్తున కరెన్సీని తరలించాడు. ఈ అవకతవకలన్నీ, అమెరికా సామ్రాజ్యవాదులపైనా, వారి తొత్తుపాలకులపైన ప్రజల వ్యతిరేకతకు కారణమైనాయి. ఈ అంశాలు అమెరికా ఓటమికి ప్రధాన కారణంగా ఉంటే, మరో కారణంగా, తాలిబన్లు సరైన వ్యూహం-ఎత్తుగడలతో నిర్వహించిన గెరిల్లా యుద్ధం ఉంది.


వాస్తవంగా ఈ యుద్ధంలో, అఫ్ఘాన్ ప్రభుత్వ సాయుధ బలగాల సంఖ్యతో పోల్చినప్పుడు, తాలిబన్ గెరిల్లా బలగాల సంఖ్య చాలా తక్కువే. అఫ్ఘాన్ ప్రభుత్వం వైపు, అమెరికా నేతృత్వంలోని వేలాది మంది నాటో సాయుధ బలగాలతోపాటు, మూడున్నర లక్షల మంది ʹఅఫ్ఘాన్ నేషనల్ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ʹ (ఏఎ డీఎస్ఎఫ్) ఉంటే, తాలిబన్ గెరిల్లాలు కేవలం 75 వేల మంది మాత్రమే ఉన్నారు. తాలిబన్ ఫైటర్ ఆయుధాలు, శతృవు ఆయుధాలతో పోల్చినప్పుడు, చాలా నాసిరకమైనవే. వీరి తర్ఫీదు కూడా అంతంతమాత్రమే. వీరికి విదేశీ సహాయం కూడా తక్కువే. అయినా ఒక తెలివైన వ్యూహంలో భాగంగా, పునాది ప్రజా సమూహాలలోనూ, మైనారిటీ జాతులలోనూ, యుద్ధ ప్రభువులలోను అమెరికా సామ్రాజ్యవాదుల పైనా, వారి తొత్తుల పైన ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకున్నారు. ఈ వ్యతిరేకతను, అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటనా శక్తిగా మలిచి, తమ పోరాట శక్తిని పెంచుకున్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో గెరిల్లా యుద్ధాన్ని పట్టుదలగా, సమరశీలంగా నిర్వహించి, అమెరికాపై విజయం సాధించారు. ఈ విజయం, నేడు అతి అధునిక టెక్నాలజీ, కమ్యూనికేషన్ వ్యవస్థ, యుద్ధసామాగ్రి ఉన్న అధునిక రాజ్యంతో తలబడి, బలప్రయోగంతో రాజ్యాధికారాన్ని సాధించుకోవడం సాధ్యమా? అనే ప్రశ్నకు, సాధ్యమే అని సమాధానం ఇచ్చింది.


అయితే నేడు అమెరికాకు సంభవించిన ఈ ఓటమి తాలుకూ ఛాయలు, ఒబామా పాలన నాటికే కనిపించాయి. అప్పటినుండే అప్లాన్ నుంచి అమెరికా సాయుధ బలగాల తరలింపు విషయం, ఎజెండాలోకి వచ్చింది. ఇందుకనుగుణంగా, ఆ తదుపరి ʹఖతర్ʹ దేశంలోని దోహాలో, తాలిబన్లకు అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్ దేశాలకు చెందిన ప్రతినిధులకు మధ్య చర్చలు జరుగుతూ వచ్చాయి. ఈ దోహా ప్రక్రియలో, తాలిబన్లను కీలుబొమ్మ పాలనలో విలీనం చేసి, వారి మధ్య శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశం కూడా ఉంది.


2019-20లలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంఫ్ అధికారులు తాలిబన్లతో చర్చలు జరిపి, 2021 నాటికి అప్లాన్ నుంచి తమ సాయుధ బలగాలను వెనక్కు రప్పించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక, అఫ్లాలో అమెరికా సాయుధ బలగాలకు జరుగుతున్న నష్టాలు, దేశంలో సుడులు తిరుగుతున్న ఆర్థిక, ద్రవ్య సంక్షోభమూ, అఫాలో అమెరికా సైనిక బలగాల మోహరింపుకు వ్యతిరేకంగా అమెరికా ప్రజల నిరసన, ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.


పై నేపథ్యంలోనే, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారులు అగష్టు 31, 2021 కల్లా అప్లాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకొనేలా తాలిబన్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే అమెరికా సైన్యం, అఫ్ఘాన్ ను వీడి వెళ్ళకముందే, తాలిబన్లు ఆగష్టు 15కల్లా అతివేగంగా దూసుకొచ్చి, కాబూల్ ను సైతం ఆక్రమించారు. ఈ సందర్భంగా సామ్రాజ్యవాదులతోపాటు, అఫ్ఘాన్ కీలుబొమ్మ ప్రభుత్వం ఎంతో అశ పెట్టుకున్న ʹఅఫ్ఘాన్ నేషనల్ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ʹ (ఏఎ డీఎస్ఎఫ్) ఏ మాత్రం ప్రతిఘటన ఇవ్వకుండా, తాలిబన్లకు తేలికగా లొంగిపోయింది. కీలుబొమ్మ ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనీ, అతని మంత్రివర్యులు ముందుగానే పలాయనం చిత్తగించారు. అయితే పంజ్ షీర్ ప్రాంతంలో మసూద్ నాయకత్వంలో పోరాటకారులు తాలిబన్లకు లొంగకుండా గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో కూడా తాలిబన్ అధీనంలోకి రాలేదు. ఈ పరిణామం, ప్రపంచాధిపత్యం కోసం తహతహలాడుతున్న అమెరికాకు ఒక గట్టి దెబ్బయింది. అంతర్జాతీయ రాజకీయ సమీకరణలలో కూడా ఈ పరిణామం మార్పు తెస్తుంది.


ఈ పరిణామం అఫ్ఘాన్ పీడిత ప్రజలకూ,మైనారిటీలకూ, జాతులకూ, మహిళలకూ, ప్రజాస్వామిక శక్తులకు ఏమంత సానుకూలమైనది కాదు కనుక, అఫ్ఘాన్ లోని ʹవిప్లవ శిబిరంʹ ఇస్లాం చాందసవాదంతో కూడుకున్న అఫ్ఘాన్ అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థకూ, దానికి యజమానిగా రూపొందబోయే కొత్త సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను పోరాటానికి సిద్ధపరచాలి.


ఇప్పటికే, ప్రముఖ సామ్రాజ్యవాద దేశాలన్నీ అప్లాన్ పై దృష్టి పెట్టాయి. ఇందుకు కారణం అఫ్ఘాన్ ప్రజలపై ప్రేమ కాదు, అఫ్ఘాన్ లో సుస్థిరపాలన ఏర్పడాలని కాదు, ఆ దేశం అభివృద్ధి పథాన పయనించాలని కాదు. ఈ దేశాల దృష్టి, అఫ్ఘాన్ భూగర్భంలోని అపార

ఖనిజసంపదను కొల్లగొట్టడంపైనా, ఆ దేశంపై అధిపత్యాన్ని సాధించడంపైన ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని అత్యంత విలువైన ఖనిజాలు అఫ్ఘాన్ లోనే ఉన్నాయి. గతేడాది అమెరికా వీటి విలువను మదించింది. వీటి విలువ 3 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. భారతీయ మారక విలువతో రూ|| 210 లక్షల కోట్లు ఉంటుంది. ఇక్కడి భూగర్భంలో రాగి, ఇనుము, బంగారం ఉన్నాయి. వీటితోపాటు, ప్రపంచంలోనే అతి అరుదుగా దొరికే మూలకాలు (లాటినం, టంగ్ స్టన్, లిథియం, సీలియం, అల్యూమినియం, జింక్, మెర్క్యూరీ... వగైరా), అఫ్ఘాన్ భూగర్భంలో వెలుగు చూసాయి. వీటిని ఎలక్ట్రానిక్, ఉపగ్రహ, విమాన, రాకెట్లతోపాటు, అత్యాధునిక సైనిక పరికరాలలో వినియోగిస్తారు.


ఇవికాక ముడిచమురు, సహజ వాయువులను అప్లాన్ కలిగి ఉంది. కొన్ని ప్రావీన్సులలో విలువైన నీలాలు, రత్నాలు, పచ్చలు, మాణిక్యాలు కోట్ల సంఖ్యలోనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సంపదలో చాలా భాగం, చట్టవిరుద్ధంగా విదేశాలకు తరలి వెళ్ళింది. గడిచిన ఈ 20 ఏళ్ళలో, అమెరికా పెద్దమొత్తంలోనే అఫ్ఘాన్ సంపదను కొల్లగొట్టుకుపోయింది. ప్రస్తుతం అమెరికన్ సామ్రాజ్యవాదుల ఓటమి నేపథ్యంలో, చైనా సోషల్ సామ్రాజ్యవాదులు, రష్యా సామ్రాజ్యవాదులు అఫ్ఘాన్ పై తమ పట్టును సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అఫ్ఘాన్ పై తమ నయావలస దోపిడీని కొనసాగిస్తూ, అక్కడి విలువైన సంపదను దోచుకునేందుకు పధకాలు రూపొందిస్తున్నాయి.


తాలిబన్ల మొగ్గు కూడా ఈ వైపు కొంత ఎక్కువగానే ఉంది. ఇప్పటికే తాలిబన్లు, చైనాతో మాకు బలమైన సంబంధాలు ఉన్నాయనీ, మేము వారి నుంచి అర్థికసహాయం తీసుకుంటామనీ, బెల్ట్ అండ్ రోడ్ పథకానికి సహకరిస్తామని ప్రకటన చేసారు. సారాంశంలో ఈ నిర్ణయాలన్నీ, చైనాకు, అఫ్ఘానిస్తాన్ నుంచి విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకు దోహదపడేవే. అమెరికా కూడా తాలిబన్లపై ఒత్తిడి పెంచి, తన దోపిడీని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నది. అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ బ్యాంక్ లో ఉన్న, అఫ్ఘాన్‌కు చెందిన 7 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని స్థంభింపజేసి, తాలిబన్లను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇదే ఉద్దేశంతో ఐఎమ్ ఎఫ్, యూరప్ దేశాలు అఫ్ఘాన్ కు గతంలో చేస్తామన్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తూ, తాలిబన్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాలిబన్లు కూడా సామ్రాజ్యవాదులకు తమ తలుపులను బార్లా తెరిచే ఉంచారు.


2001లో, అమెకన్ సామ్రాజ్యవాదులు ʹటెర్రరిజంపై యుద్ధంʹ పేరుతో అఫ్ఘాన్ పై దాడి చేసి, దానిని అక్రమించారు. గడిచిన ఈ 20 ఏళ్ళలో అమెరికన్ సామ్రాజ్యవాదులు, అఫ్ఘాన్ లో ʹటెర్రరిజాన్నిʹ అంతమెందించలేకపోవడమే కాకుండా, అఫ్ఘాన్ లో తీవ్రమైన సంక్షోభానికి విధ్వంసానికి కారణమైనారు. వారు అక్కడ నెలకొల్పిన ʹప్రజాస్వామ్యంʹ, ʹఅభివృద్ధిʹ ఉత్త భ్రమేనని తేలిపోయింది. ఇప్పుడు అప్లాన్ ప్రజలకు, ఇస్లాం చాందసవాదాన్ని అవలంభిస్తున్న భూస్వాములు, యుద్ధ ప్రభువులు వారికి ప్రతినిధులైన తాలిబన్లు, దళారీ, నిరంకుశ బూర్జువా వర్గం, వీరికి గురువులైన కొత్త, పాత సామ్రాజ్యవాదులు శతృవులే. ఈ నేపథ్యంలో అప్లాన్ లో నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయడంతోపాటు, సోషలిజం, కమ్యూనిజం దిశగా పురోగమింపజేసేందుకు విప్లవ శిబిరం, ప్రజలను సమాయత్తపరచాల్సిన అవసరం ఉంది.


అభయ్,

అధికార ప్రతినిధి,

కేంద్ర కమిటీ,

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).

Share it:

TELANGANA

Post A Comment: