మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని శివారు బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కంబాలపల్లి మహేష్ ఒకటవ వార్డు సభ్యత్వానికి ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని ఎంపీఓ రామారావు కు స్వయంగా అందజేశారు. వీరితో పాటు రెండవ వార్డ్ నెంబర్ జబ్బా రామనాథం కూడా వార్డు సభ్యుడు పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామనే నమ్మకంతో మా గ్రామ ప్రజలు మా ఇరువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. కానీ సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆదివాసి గిరిజనుల మైన మమ్ములను, మా గ్రామాన్ని అభివృద్ధి విషయంలో సర్పంచ్ అస్సలు పట్టించుకోవట్లేదని తన బాధను వ్యక్తం చేశారు. తన సొంత హ్యాబిటేషన్ ను ఒక రకంగా మా ఆదివాసి గిరిజన హ్యాబిటేషన్ ను మరో రకంగా చూస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు సర్పంచ్ తో మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. గ్రామ సర్పంచ్ అంటే గ్రామపంచాయతీ మొత్తానికి ప్రథమ పౌరులని, గ్రామపంచాయతీ మొత్తం అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆదివాసీ గిరిజన గ్రామమైన బచ్చల కోయగూడెం ను అన్ని రకాలుగా అభివృద్ధికి దూరం చేయడం సరైన పద్ధతి కాదని, సర్పంచ్ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. మా పై నమ్మకంతో మమ్ములను ఎన్నుకున్న ప్రజలకు ఏమి చేయలేక పోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ మేము రాజీనామా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా పత్రాలను జిల్లా పంచాయతీరాజ్ అధికారి కి అందజేస్తామని ఎం పి ఓ రామారావు మన్యం టీవీ కి తెలిపారు.
Post A Comment: