మన్యం టీవీ,బూర్గంపాడు:
తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మన్యంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కొనియాడారు. ట్రస్టు ఆధ్వర్యంలో సారపాకలోని ఎంఎస్ఆర్ స్కూల్, మోరంపల్లి బంజరలోని న్యూస్కాలర్స్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులు, పుస్తకాల నిమిత్తం ఒక్కో పాఠశాలకు రూ. లక్ష చెక్కును మంగళవారం ఆయన చేతుల మీదుగా పాఠశాల బాధ్యులకు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యాదానం అన్నింటి కన్నా గొప్పదని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలుగా వందల మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించడంతో పాటు దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు తెరవకపోయినా ఆన్లైన్లో పాఠాలు కొనసాగుతున్నందున రుసుములు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నారని వివరించారు. ఓ విద్యార్ధి ప్రస్తుతం కాన్పూర్ ఐఐటీలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు,ఇరవెండి సర్పంచి కోర్సా లక్ష్మి,తాళ్లూరి రాధాకృష్ణ,సొసైటీ సీఈవో బీ వీ ప్రసాద్,పాఠశాల నిర్వాహకులు మర్రి శశిధర్ రెడ్డి,సీహెచ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: