మండలంలోని చాలా పంచాయతీలలో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉంది
జగ్గారం పంచాయితీలో డెంగ్యూ వ్యాధులకు కారణం అటవీ సరిహద్దు నీటి నిలువలే అంటున్న గ్రామ ప్రజలు
పరిసరాల పరిశుభ్రత అవసరం- మండల ఎంపిపి గుమ్మడి గాంధీ
మన్యం మనుగడ, పినపాక:
వర్షాకాలం కారణంగా, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో విష జ్వరాలు ప్రబలి ప్రజలు మృత్యువాత పడుతున్నారని, పినపాక మండలంలోని అన్ని పంచాయితీల సర్పంచులు బాధ్యత వహించి, వారి వారి గ్రామాలలో నీటి నిల్వలు లేకుండా చిన్న చిన్న కుంటలను పూడ్చి వేయాలని, లేనిచో దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాల బారిన పడి మృత్యువాత పడే అవకాశం ఉందని పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఒక ప్రకటనలో అన్నారు . ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా బాధ్యత వహించి, వారివారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేటట్లు ప్రవర్తించాలని, పంచాయితీ వారికి సహకరించి, చెత్తా-చెదారం లేకుండా చేసుకోవాలని అన్నారు. పినపాక మండలం లోని జగ్గారం పంచాయితీలో ఇప్పటివరకు డెంగ్యూ కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారని, ప్రజలు ఇకనైనా మేల్కొని వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. గతంలో జగ్గారం పంచాయతీలో అటవీశాఖ వారు గ్రామంలోని గృహాలను ఆనుకొని అటవీ సరిహద్దును ( ట్రెంచ్ ) నిర్ణయించడం కారణంగా, ఆ ప్రాంతంలో నీటి నిల్వలు పెరిగి దోమలకు ఆవాసం గా మారి డెంగ్యూ వ్యాధికి కారణం అయింది అని, అటవీశాఖ వారు ఒకసారి జగ్గారం లోని అటవీ సరిహద్దును గమనించి, ఏమైనా మార్పులు చేస్తే ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుందని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు.
ఈ విషయమై "మన్యం మనుగడ" ఏడూళ్ల బయ్యారం అటవీక్షేత్రాధికారి తేజస్విని ని వివరణ కోరగా"జగ్గారం పంచాయతీకి ఆనుకొని ఉన్న అటవీ సరిహద్దును పరిశీలించి, తదుపరి చేయబోయే కార్యాచరణను తెలియజేస్తామని వివరణ ఇచ్చారు. విష జ్వరాలకు అటవీ సరిహద్దు కారణం అయినట్లయితే, పరిష్కార దిశగా నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.
Post A Comment: