మన్యం టీవీ : జూలూరుపాడు,
ఆగస్టు 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలోని గుండెపుడి గ్రామంలో శనివారం బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, పోతురాజు, గ్రామ దేవతామూర్తుల విగ్రహాలను వేద పండితుల మంత్ర ఉచ్చారణ లతో అశేష భక్త జన సంద్రం నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. గత మూడు రోజులుగా గ్రామంలో ఏర్పాటుచేసిన యాగశాలలో వేద పండితులచే గ్రామ దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, వివిధ రకాల అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ తమ ఇంటి ఆడబిడ్డలు, తోబుట్టువులు, బంధువులతో గ్రామమంతా భక్తి పారవశ్యంతో సందడిగా మారింది. గ్రామ దేవతలను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేశారు. భక్తులంతా నీళ్లు ఓరా పోసి తమ పిల్లాపాపలను పాడి పంటలను చల్లగా చూడాలంటూ వేడుకుని టెంకాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలిరావడంతో జాతర వాతావరణం నెలకొంది. ప్రతిష్ట అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Post A Comment: