- కేవలం హామీలతోనే గిరిజనుల్లో ఆశలు లేపుతున్నారు
- సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
మన్యం మనుగడ,పినపాక:
ఎంతోకాలంగా భూమిని మేము జరుపుతున్నామని దున్నేవాడిదే భూమి అని గిరిజనులు ఒకవైపు గోడు వినిపిస్తూ ఉంటే హక్కులు లేనిదే అడుగు పెట్టనీయమని కేసు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు ఒకవైపు అమాయక గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం పినపాక మండలం ఈ బయ్యారంలో నట్టి శంకరయ్య అధ్యక్షతన పోడు రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోడు భూముల్లో అర్హులైన రైతులకు పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది తప్ప ఆచరణలో మాత్రం కొంచెం కూడా ముందుకు సాగటం లేదన్నారు. ఇలా అటవీ ప్రాంతాల్లోని భూములకు హక్కుల చిక్కులు తేలకుండా ఏళ్ల తరబడి సమస్య కొనసాగుతున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనివల్ల గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ఏటా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అటవీ ప్రాంతాలు హద్దులుగా ఉన్న గ్రామాల్లో సాగు మొదలైతే ఘర్షణలు ప్రారంభమవుతున్నాయని, సాగు పనులకు భూముల్లోకి వస్తున్న గిరిజనులను అధికారులు అడ్డుకుంటున్నారని దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి పోడు రైతులకు పట్టాలు ఇచ్చి శాశ్వత హక్కులు కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, పార్టీ మండల కమిటీ సభ్యులు దుబ్బ గోవర్ధన్, మడివి రమేష్, కనితి వెంకటేశ్వర్లు, దడిగల వెంకన్న, పూస నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: