మన్యం టీవీ మణుగూరు: హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను చర్చించకపోవడం బాధాకరమని,సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల అధికారులు సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని,ఈ సమావేశం దీనికి చక్కని ఉదాహరణ అని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టీ. యూ ఏరియా నాయకులు ఏ.మంగీలాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.మంగళవారం సాయంత్రం కూనవరం గేట్ అడ్డా లో జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.సోమవారం జరిగిన సింగరేణి డైరెక్టర్ల బోర్డు సమావేశంలో సింగరేణి కార్మికుల, అధికారుల పదవి విరమణ వయో పెంపు నజరానా తో పాటు,కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కూడా ఏదో ఒక తీపి కబురు వింటామని ఎదురుచూసిన కాంట్రాక్ట్ కార్మికులను అధికారుల తీరు నిరాశ పరిచిందన్నారు. సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకత లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను యాజమాన్యం గుర్తించకపోవడం బాధాకరమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అతి తక్కువ జీతాలతో బ్రతుకు బండిని లాగుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు,ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు,ప్రైవేట్ వాహన డ్రైవర్లకు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, సింగరేణి యాజమాన్యం కానీ కనీస చొరవ చూపకపోవడం పట్ల నిరసన తెలియజేస్తున్నామన్నారు.హైపవర్ కమిటీ వేతనాలు కానీ,కరోనాతో చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల ఎక్స్గ్రేషియా కానీ,వైద్యం కానీ,కరోనా సోకిన కాంట్రాక్ట్ కార్మికుల 14 రోజుల వేతనం తో కూడిన సెలవు కానీ, ముఖ్యమంత్రి హామీ క్రమబద్ధీకరణ కానీ, లాభాలలో వాటా కానీ,ఏ విషయాలు కూడా సింగరేణి వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసిన కాంట్రాక్ట్ కార్మికులకు బోర్డు సమావేశం నిరాశను మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కే.రవి, వీర్రాజు,గురుమూర్తి,సాయి, సాంబశివరావు,వెంకటేశ్వర్లు సతీష్,రజబ్ ఆలి, రామకృష్ణ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: