మన్యంటీవీ, అశ్వారావుపేట: వాళ్ళది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఆదరించే ఆత్మీయులు లేక, అనారోగ్యంతో ఉన్న కూతురికి మెరుగైన వైద్యం చేయించుకోలేక మరో కూతురితో కలిసి కూలి నాలి చేసుకొని నెట్టుకొస్తూ మనసున్న మహారాజుల ఆపన్నహస్తం కోసం ఓ తల్లి ఎదురుచూస్తుంది. దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామానికి చెందిన పూజరి సుధారాణికి ఇద్దరు కుమార్తెలు. తన భర్తతో జరుగుతున్న విభేదాలతో అక్కడ ఉండలేక అశ్వారావుపేట మండలంలోని వేదాంతపురం గ్రామం వచ్చి ప్రస్తుతం జీవిస్తుంది. అయితే ఆమె పెద్ద కూతురు పూజరి హేమలత ఆరోగ్యం సరిగా ఉండక పోవడంతో 2013 లో విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బ్రెయిన్ ఆపరేషన్ చేయించింది. ప్రస్తుతం మరలా హేమలత పరిస్థితి బాగోక పోవడంతో విజయవాడ హాస్పిటల్ కు తీసుకువెళ్ళగా ఆపరేషన్ చేయాలని రూ. 1లక్ష ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏమి చేయాలో తెలియక ఇద్దరు కూతుళ్ళతో ఆ తల్లి తీవ్ర ఆవేదన చెందుతుంది. సొంత గూడు కూడా లేని ఆమె రోజు కూలి చేసుకుంటేనే గాని కుటుంబం గడవని పరిస్థితి. ఈ క్రమంలో కూతిరికి చికిత్స కోసం దాతల సహకారం కోరుతుంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే నా బిడ్డను కాపాడుకోగలుగుతానని ఆమె కోరుకుంటుంది.
Post A Comment: