మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం, బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లెపల్లి శివారు గ్రామంలో తోలెం విజయ్ కుమార్ (25 సం) అనే యువకుణ్ణి మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో నిన్న రాత్రి దాదాపు 8 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పూనెం సురేష్ గొడ్డలితో నరికి చంపాడు. తోలెం విజయ్ కుమార్ గత ఐదు సంవత్సరాలుగా కూలీ పనులకు వెళ్తూ మరియు దేవుడు అని చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఇదే గ్రామానికి చెందిన పూనేం సురేష్(22 సం)యొక్క చెల్లె నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విజయ్ కుమార్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లె పురుగుల మందు తాగి చనిపోయిందనే మూఢనమ్మకంతో అనుమానం పెంచుకున్న సురేష్ నిన్నటి రోజున రాత్రి 8 గంటలకు గొడ్డలి పట్టుకుని మృతుడి ఇంటికి వెళ్ళి మృతుడితో గొడవపెట్టుకుని ఇంటి ముందు వాకిట్లోకి లాక్కొచ్చి మెడ వెనక భాగంలో మరియు భుజం భాగంలో గొడ్డలితో నరకగా తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు, తల్లిదండ్రులు కాలం చేశారు.తోబుట్టువులెవరూ లేరు. మృతుడి పెద్దమ్మ పూనెం సారక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై సీఎచ్.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: