మన్యం మనుగడ డెస్క్ : సిద్దిపేట జిల్లాలో ఆదివారం సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి సిద్దిపేట చేరుకున్న ఆయనకు హెలిప్యాడ్ వద్ద మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ తొలుత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో కలియదిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఎకరం విస్తీర్ణంలో రూ. 4 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలతో (జీ ప్లస్ వన్)గా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం, మొదటి అంతస్తులో నివాస సముదాయం ఉంటుంది.
అక్కడి నుంచి సీఎం నేరుగా కొండపాక మండలం రాంపల్లి శివారులో నూతన కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి కమిషరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మధ్యలో పలువురు సమర్పించిన వినతులను సీఎం స్వయంగా ఓపికగా స్వీకరించారు. వినతులను పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అటు నుంచి వెళ్లి కొండపాక మండలం దుద్దెడ శివారులో నూతనంగా సమీకృత కలెక్టర్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. 50 ఎకరాల్లో అధునాతన హంగులతో ఈ కలెక్టరేట్ను నిర్మించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎస్ సోమేష్ కుమార్, మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: